Telugu Global
Telangana

మూసీ పరివాహక నిర్వాసితులకు 16 వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు : సీఎం

మూసీ పరివాహక పరిధిలో నిర్వాసితులకు 16 వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌, మెట్రో రైలుపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు.

మూసీ పరివాహక నిర్వాసితులకు 16 వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు : సీఎం
X

మూసీ పరివాహక పరిధిలో నిర్వాసితులకు 16 వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌, మెట్రో రైలుపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే అధికారులు చేపట్టిన సర్వే ప్రకారం 10,200 మందిని నిర్వాసితులుగా గుర్తించారు. రంగారెడ్డి, హైదరాబాద్ మరియు మేడ్చల్‌.. మూడు జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో అధికారుల బృందాలు రేపు ఇంటింటికి వెళ్లి అక్కడున్న ప్రజలకు ఎక్కడెక్కడ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించారో తెలియజేస్తారు. ముందుగా రివర్ బెడ్ లో ఆక్రమణలో ఉన్న 1600 ఇళ్లను తొలగించి.. అక్కడ ఉన్న వారిని తరలిస్తారు. మూసీ బఫర్ జోన్ లో నివసించే వ్యక్తులు, నిర్మాణాలకు RFCTLARR చట్టం ప్రకారం పరిహారం చెల్లిస్తారు. నిర్మాణ ఖర్చు తో పాటు, వారికి పట్టా ఉంటే భూమి విలువను పరిహారంగా చెల్లిస్తారు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా కేటాయిస్తారు.

మూసీ బాధిత ప్రజలందరికీ చట్ట ప్రకారం పునరావాసం కల్పిస్తామని ముఖ్యమంత్రి ఇప్పటికే భరోసా ఇచ్చారు. ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్‌ కూడా అధికారులతో కలిసి మూసీ పరివాహక ప్రాంతంలో పర్యటించారు. నిర్వాసితుల ను సంప్రదించి పునరావాసం కల్పించే ప్రక్రియను కలెక్టర్లు రేపు ప్రారంభిస్తారు. చెరువులు, నాలాల ఆక్రమణల తొలగింపుపై సీఎం అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆక్రమిత చెరువులు, నాలాలతోపాటు మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసించే పేదల వివరాలు సేకరించాలని, వారికి డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు లేదా ప్రత్యామ్నాయం చూపించాలని ఆదేశించారు. ఔటర్‌ రింగ్‌రోడ్డు లోపల ఉన్న చెరువుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని, ఆక్రమణలకు గురి కాకుండా పర్యవేక్షించేందుకు చెరువుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

First Published:  24 Sept 2024 3:30 PM GMT
Next Story