చాంపియన్స్ ట్రోఫికి ఒంటరిగానే దుబయికి
కుటుంబ సభ్యులను వెంట తీసుకెళ్లేందుకు అనుమతించని బీసీసీఐ
![చాంపియన్స్ ట్రోఫికి ఒంటరిగానే దుబయికి చాంపియన్స్ ట్రోఫికి ఒంటరిగానే దుబయికి](https://www.teluguglobal.com/h-upload/2025/02/13/1403130-india-champions-trophy.webp)
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫికి టీమిండియా క్రికెటర్లు ఒంటరిగానే దుబయికి పయనమవుతున్నారు. అదేంటే టీమ్ మేనేజ్మెంట్ సహా క్రికెటర్లంతా వెళ్తారు అంటున్నారు కదా? అవును.. మేనేజ్మెంట్ తో పాటు క్రికెటర్లు, సపోర్టింగ్ స్టాఫ్ మాత్రమే చాంపియన్స్ ట్రోఫీ కోసం ఫ్లయ్ అవుతున్నారు. చాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాల్గొనే మ్యాచ్లను దుబయి వేదికగా నిర్వహిస్తున్నారు. పాకిస్థాన్ లో క్రికెట్ ఆడేందుకు భారత ప్రభుత్వం ఒప్పుకోకపోవడంతో తటస్త వేదికగా భారత్ మ్యాచ్లు నిర్వహిస్తున్నారు. సాధారణంగా ఏ టోర్నీకి వెళ్లినా, ఏ దేశ పర్యటనకు వెళ్లినా క్రికెటర్లతో పాటు కుటుంబ సభ్యులను వెంట తీసుకెళ్లేందుకు అనుమతిస్తారు. వాళ్లందరికీ ప్రత్యేకంగా బస ఏర్పాట్లు చేస్తారు. కానీ మొదటిసారిగా బీసీసీఐ చాంపియన్స్ ట్రోఫీకి వెళ్తున్న క్రికెటర్లతో పాటు కుటుంబ సభ్యులకు అనుమతి నిరాకరించింది. టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ కోసం శనివారం ముంబయి నుంచి దుబయికి ప్రయాణమవుతుంది. ఈనెల 20న బంగ్లాదేశ్, 23న పాకిస్థాన్, మార్చి 2న న్యూజిలాండ్ తో టీమిండియా తలపడుతుంది. బీసీసీఐ కొత్త పాలసీ ప్రకారం 45 రోజులు అంతకన్నా ఎక్కువ రోజులు టీమిండియా ఏ టోర్నీకైనా, ఏ దేశ పర్యటనకైనా వెళ్తే మాత్రమే రెండు వారాల పాటు కుటుంబ సభ్యులను వారితో ఉండేందుకు అనుమతిస్తారు. చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ను పరిగణలోకి తీసుకున్నా టోర్నీ డ్యురేషన్ మూడు వారాలే ఉండటంతో క్రికెటర్ల వెంట కుటుంబ సభ్యులను అనుమతించలేదని.. ఆ నిబంధన ఈ టోర్నీతోనే అమల్లోకి తెచ్చారని బీసీసీఐ వర్గాలు చెప్తున్నాయి.