Telugu Global
National

4 రాష్ట్రాల్లో బర్డ్‌ ఫ్లూ ఆనవాళ్లు.. - వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం

బర్డ్‌ ఫ్లూతో మనుషులకు కూడా ముప్పు పొంచి ఉంటుందని, అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ఏవియన్‌ ఇన్‌ఫ్లుయెంజా మనుషులకూ సోకే ఆస్కారం ఉందని కేంద్రం తెలిపింది.

4 రాష్ట్రాల్లో బర్డ్‌ ఫ్లూ ఆనవాళ్లు.. - వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం
X

దేశంలోని వివిధ ప్రాంతాల్లో బర్డ్‌ ఫ్లూ విస్తరిస్తోందని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. దాని ఆనవాళ్లు, వ్యాప్తిని 4 రాష్ట్రాల్లో గుర్తించామని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ (నెల్లూరు), మహారాష్ట్ర (నాగపూర్‌), కేరళ (అలప్పుజ, కొట్టాయం), జార్ఖండ్‌ (రాంచీ)లలో దీని వ్యాప్తిని గుర్తించినట్లు తెలిపింది.

పౌల్ట్రీలు, ఇతర పక్షులకు సంబంధించి అసాధారణ మరణాలు సంభవించడంపై అప్రమత్తంగా ఉండాలని, ఆ విషయాన్ని వెంటనే పశుసంవర్ధక శాఖకు తెలియజేయాలని అన్ని రాష్ట్రాలకూ కేంద్ర ప్రభుత్వం సూచించింది. తద్వారా బర్డ్‌ ఫ్లూ నివారణ చర్యలు తీసుకోవచ్చని తెలిపింది.

బర్డ్‌ ఫ్లూతో మనుషులకూ ముప్పు

బర్డ్‌ ఫ్లూతో మనుషులకు కూడా ముప్పు పొంచి ఉంటుందని, అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ఏవియన్‌ ఇన్‌ఫ్లుయెంజా మనుషులకూ సోకే ఆస్కారం ఉందని కేంద్రం తెలిపింది. యాంటీ వైరల్‌ ఔషధాలు, పీపీఈ కిట్లు, మాస్కులను అందుబాటులో ఉంచుకోవాలని ఈ సందర్భంగా సూచించింది.

ఇప్పటికే బర్డ్‌ ఫ్లూ వ్యాప్తి క్రియాశీలకంగా ఉన్న రాష్ట్రాలు మరిన్ని చర్యలు తీసుకోవాలని, ఇన్ఫెక్షన్‌ సోకిన పక్షులను వధించే వారితో పాటు పర్యవేక్షకుల నుంచి క్రమంగా నమూనాలు తీసుకొని హెచ్‌ఎస్‌ఎన్‌1 పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేసింది.

First Published:  1 Jun 2024 2:05 AM GMT
Next Story