Telugu Global
National

నితీష్‌ సర్కార్‌కి హైకోర్టులో ఎదురుదెబ్బ.. - 65 శాతం రిజర్వేషన్ల నిర్ణయం కొట్టివేత

బిహార్‌ రాష్ట్రంలో కులగణన చేపట్టి.. ఆ నివేదికను గతేడాది నవంబరులో అసెంబ్లీలో ప్రవేశపెట్టిన నితీశ్‌ ప్రభుత్వం.. అదే సమయంలో రిజర్వేషన్లను పెంచుతూ సవరణ బిల్లు తీసుకొచ్చింది.

నితీష్‌ సర్కార్‌కి హైకోర్టులో ఎదురుదెబ్బ.. - 65 శాతం రిజర్వేషన్ల నిర్ణయం కొట్టివేత
X

బిహార్‌ హైకోర్టులో నితీశ్‌ సర్కార్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లను 65 శాతానికి పెంచుతూ సీఎం నితీశ్‌ కుమార్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పట్నా హైకోర్టు కొట్టివేసింది. ఈ పెంపు రాజ్యాంగ విరుద్ధమని న్యాయస్థానం స్పష్టం చేసింది. 65 శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తూ గురువారం సంచలన తీర్పు వెలువరించింది.

బిహార్‌ రాష్ట్రంలో కులగణన చేపట్టి.. ఆ నివేదికను గతేడాది నవంబరులో అసెంబ్లీలో ప్రవేశపెట్టిన నితీశ్‌ ప్రభుత్వం.. అదే సమయంలో రిజర్వేషన్లను పెంచుతూ సవరణ బిల్లు తీసుకొచ్చింది. ఆ బిల్లుకు రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీంతో విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు 50 శాతం నుంచి 65 శాతానికి పెరిగాయి. వీటికితోడు ఆర్థికంగా వెనుకబడినవారిని ఉద్దేశించిన ఈబీసీ రిజర్వేషన్లు 10 శాతం కలిపితే మొత్తం 75 శాతానికి రిజర్వేషన్లు చేరాయి. ఈ పెంపు తో ఎస్సీలకు 16 నుంచి 20 శాతానికి, ఎస్టీలకు ఒక శాతం నుంచి రెండు శాతానికి, ఓబీసీ, ఈబీసీలకు కలిపి 30 శాతం ఉన్న రిజర్వేషన్‌ 43 శాతానికి పెరిగింది.

ఈ పెంపుపై అభ్యంతరం వ్యక్తం చేసిన కొన్ని వర్గాలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. వాటిపై ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం ఈ ఏడాది మార్చిలో తీర్పును రిజర్వు చేసింది. తాజాగా 65 శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తూ గురువారం తుది తీర్పు చెప్పింది.

First Published:  20 Jun 2024 8:53 AM GMT
Next Story