Telugu Global
National

వెంటపడి వేటాడి నడిరోడ్డుపై వ్యక్తి హత్య

తమిళనాడు రాష్ట్రంలో అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై ఓ వ్యక్తిని ఆరుగురు వ్యక్తులు కత్తులతో నరికి చంపారు.

వెంటపడి వేటాడి నడిరోడ్డుపై వ్యక్తి హత్య
X

తమిళనాడు రాష్ట్రంలో అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై ఓ వ్యక్తిని ఆరుగురు వ్యక్తులు కత్తులతో నరికి చంపారు. ప్రాణభయంతో అతడు పరుగులు తీయగా వెంటపడి వేటాడి కత్తులతో నరికి చంపారు. ఈ సంఘటన జరిగేటప్పుడు చుట్టూ జనం ఉన్నా ఎవరూ కూడా ఆపడానికి ప్రయత్నం చేయలేదు. ఈ దృశ్యాలన్నీ సమీపంలోని సీసీ టీవీలో నమోదు కావడంతో అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

తిరునెల్వేలి నగరంలో సోమవారం తెల్లవారుజామున ఓ వ్యక్తిని ఆరుగురు వ్యక్తులు తరుముకుంటూ వచ్చారు. వారి వద్ద పదునైన కత్తులు ఉన్నాయి. ఆ కత్తులు చేత పట్టుకొని వారు సదరు వ్యక్తి వెంట పడుతున్నారు. వారి బారి నుంచి తప్పించుకునేందుకు బాధితుడు రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న కార్ల గుండా పరిగెత్తుతుండగా అతడిని దుండగులు అడ్డుకున్నారు. కత్తులతో విచక్షణారహితంగా నరికారు. 12సార్లు బాధితుడిని కత్తులతో నరికారు.

ఈ సంఘటన జరుగుతున్నప్పుడు రోడ్డు జనంతో రద్దీగా ఉంది. అయినప్పటికీ ఏ ఒక్కరూ హత్యను అడ్డుకోవడానికి ప్రయత్నించలేదు. బాధితుడు చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత ఆ ఆరుగురు వ్యక్తులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. సమాచారం అందుకొని అక్కడికి వచ్చిన పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీసీటీవీలో నమోదైన దృశ్యాలను పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పాత కక్షలే హత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. మృతుడికి సంబంధించిన వివరాలు, అతడికి నిందితులతో ఉన్న సంబంధాల గురించి తెలుసుకునేందుకు పోలీసులు వివరాలు ఆరా తీస్తున్నారు.

First Published:  21 May 2024 6:52 AM GMT
Next Story