Telugu Global
National

పట్టాలపై 10 సింహాలు.. కాపాడిన లోకో పైలట్‌

లోకో పైలట్‌ ముకేష్‌ కుమార్‌ సమయస్ఫూర్తిని అధికారులు ప్రశంసిస్తున్నారు. వెస్టర్న్‌ రైల్వే భావ్‌నగర్‌ డివిజన్‌ ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. సింహాలతో పాటు వన్యప్రాణుల సంరక్షణకు తమ డివిజన్‌ నిరంతరం కృషి చేస్తోందని తెలిపింది.

పట్టాలపై 10 సింహాలు.. కాపాడిన లోకో పైలట్‌
X

రైలు పట్టాలపై సేద తీరుతున్న 10 సింహాలను గుర్తించి అప్రమత్తమైన లోకో పైలట్‌ వాటిని కాపాడిన ఘటన గుజరాత్‌లో జరిగింది. తాజాగా ఇది మీడియాలో, సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. గుజరాత్‌లోని పిపావావ్‌ పోర్టు స్టేషన్‌ నుంచి గూడ్స్‌ రైలు వేగంగా వెళుతుండగా.. అదే సమయంలో ట్రాక్‌పై 10 సింహాలు సేదతీరుతున్నాయి. వాటిని గుర్తించిన లోకో పైలట్‌ ముకేష్‌ కుమార్‌ మీనా వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేసి రైలును ఆపారు. సింహాలు పట్టాల పైనుంచి లేచి దూరంగా వెళ్లే వరకు లోకో పైలట్‌ వేచి చూశారు. ఆ తర్వాత రైలును స్టార్ట్‌ చేశారు.

ఈ ఘటనతో లోకో పైలట్‌ ముకేష్‌ కుమార్‌ సమయస్ఫూర్తిని అధికారులు ప్రశంసిస్తున్నారు. వెస్టర్న్‌ రైల్వే భావ్‌నగర్‌ డివిజన్‌ ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. సింహాలతో పాటు వన్యప్రాణుల సంరక్షణకు తమ డివిజన్‌ నిరంతరం కృషి చేస్తోందని తెలిపింది. ఉత్తర గుజరాత్‌ – పిపావావ్‌ పోర్టు మార్గంలోని రైల్వే లైనులో కొన్నేళ్లుగా అనేక సింహాలు మరణిస్తున్నాయి. గిర్‌ అభయారణ్యానికి ఈ ప్రాంతం చాలా దూరంలోనే ఉన్నప్పటికీ ఇక్కడ సింహాలు తరచూ సంచరిస్తుంటాయి. దీంతో ట్రాక్‌ మార్గంలో అటవీ శాఖ కంచెలను కూడా ఏర్పాటు చేసింది.

First Published:  18 Jun 2024 2:24 AM GMT
Next Story