Telugu Global
National

‘కేరళం’గా మారనున్న ‘కేరళ’!.. - పేరు మార్చాలని అసెంబ్లీలో తీర్మానం

రాష్ట్రం పేరు మార్పునకు సంబంధించిన తీర్మానాన్ని సీఎం పినరయి విజయన్‌ సభలో ప్రవేశపెట్టగా.. అధికార ఎల్‌డీఎఫ్, కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రతిపక్ష యూడీఎఫ్‌ సభ్యులు దానిని ఏకగ్రీవంగా ఆమోదించారు.

‘కేరళం’గా మారనున్న ‘కేరళ’!.. - పేరు మార్చాలని అసెంబ్లీలో తీర్మానం
X

కేరళ రాష్ట్ర అసెంబ్లీలో సోమవారం కీలక అంశంపై తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. తమ రాష్ట్రం పేరును అధికారికంగా ‘కేరళం’గా మార్చాలని కేంద్రాన్ని కోరుతూ ఈ తీర్మానం చేశారు. గతేడాది ఆగస్టులోనే పేరు మార్పు కోసం తీర్మానం చేసి కేంద్ర హోంశాఖకు పంపించినప్పటికీ.. అందులో కొన్ని మార్పులు చేయాలని కేంద్రం సూచించింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో తాజాగా రెండో సారి తీర్మానాన్ని ఆమోదించారు.

రాష్ట్రం పేరు మార్పునకు సంబంధించిన తీర్మానాన్ని సీఎం పినరయి విజయన్‌ సభలో ప్రవేశపెట్టగా.. అధికార ఎల్‌డీఎఫ్, కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రతిపక్ష యూడీఎఫ్‌ సభ్యులు దానిని ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా సీఎం విజయన్‌ మాట్లాడుతూ.. కేరళ పేరును అన్ని భాషల్లో ’కేరళం’ అని మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లోనూ అందుకు అనుగుణంగా మార్పు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

తమ రాష్ట్రం పేరును పూర్వం నుంచే మలయాళంలో ’కేరళం’ అని పిలిచేవారని ఈ సందర్భంగా సీఎం విజయన్‌ గుర్తు చేశారు. మలయాళం మాట్లాడే ప్రజల కోసం ఐక్య కేరళ రాష్ట్రం ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ స్వాతంత్య్ర పోరాట కాలం నుంచే ఉందని ఆయన వివరించారు. రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్‌లో తమ రాష్ట్రం పేరును ‘కేరళ’ అని రాశారని, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 3 ప్రకారం దానిని ’కేరళం’గా సవరించాలని కోరారు. ఎనిమిదో షెడ్యూల్‌లో పేర్కొన్న అన్ని భాషల్లో మార్పులు చేయాలని ఆయన కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

First Published:  25 Jun 2024 2:22 AM GMT
Next Story