Telugu Global
National

నూతన ఎలక్షన్‌ కమిషనర్ల నియామకం

సుఖ్‌బీర్‌ గతంలో ఉత్తరాఖండ్‌ ప్రధాన కార్యదర్శిగా, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ చైర్మన్‌గా పనిచేశారు. అఖిల భారత సర్వీస్‌లోకి రాకముందు సుఖ్‌బీర్‌ అమృత్‌సర్‌లో ఎంబీబీఎస్‌ చదివారు.

నూతన ఎలక్షన్‌ కమిషనర్ల నియామకం
X

నూతన ఎన్నికల కమిషనర్లుగా సుఖ్‌బీర్‌ సంధూ, జ్ఞానేశ్‌కుమార్‌లను నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు వీరి నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎలక్షన్‌ కమిషనర్‌ అనూప్‌ చంద్ర పాండే గత నెల 14న రిటైర్‌ కావడం, మరో ఎల క్షన్‌ కమిషనర్‌ అరుణ్‌ గోయల్‌ హఠాత్తుగా రాజీనామా చేయడంతో ఎన్నికల సంఘంలో రెండు ఖాళీలు ఏర్పడ్డాయి. ఎలక్షన్‌ కమిషనర్లుగా ఎంపికైన సుఖ్‌బీర్, జ్ఞానేశ్‌లు ఇద్దరూ 1988 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారులే. సుఖ్‌బీర్‌ ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి కాగా, జ్ఞానేశ్‌ కేరళ క్యాడర్‌ అధికారి.

సుఖ్‌బీర్‌ గతంలో ఉత్తరాఖండ్‌ ప్రధాన కార్యదర్శిగా, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ చైర్మన్‌గా పనిచేశారు. అఖిల భారత సర్వీస్‌లోకి రాకముందు సుఖ్‌బీర్‌ అమృత్‌సర్‌లో ఎంబీబీఎస్‌ చదివారు. జ్ఞానేశ్‌ గతంలో కేంద్రంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా చేశారు. అమిత్‌ షా మంత్రిగా ఉన్న సహకార శాఖలోనూ కార్యదర్శిగా ఉన్నారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదాను కల్పించిన ఆర్టికల్‌ 370ని రద్దుచేయడంలో జ్ఞానేశ్‌ హోం శాఖలో పని చేస్తూ కీలకపాత్ర పోషించారు. ఐఐటీ (కాన్పూర్‌) పట్టభద్రుడైన జ్ఞానేశ్‌ 2014లో ఢిల్లీలో కేరళ రెసిడెంట్‌ కమిషనర్‌ ఉన్నారు.

నియామకం తీరును తప్పుపట్టిన అధీర్‌

నూతన ఎన్నికల కమిషనర్ల నియామకం తీరును సెలక్షన్‌ ప్యానెల్‌ సభ్యుడైన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అధీర్‌ రంజన్‌ చౌదరి తప్పుబట్టారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. ఇద్దరి నియామకం కోసం 212 మంది పేర్ల జాబితాను గత రాత్రి తనకు ఇచ్చారని చెప్పారు. తెల్లారితే సెలక్షన్‌ ప్యానెల్‌ చైర్మన్ మోడీ అధ్యక్షతన భేటీ ఉందని, రాత్రి ఇచ్చి మధ్యాహ్నంకల్లా 212 మందిలో ఎలక్షన్‌ కమిషనర్‌ అర్హత ఉన్న వ్యక్తిని ఎంపిక చేయడం అంటే మానవమాత్రులకు సాధ్యమా అని ప్రశ్నించారు. భేటీ జరగడానికి కేవలం 10 నిమిషాల ముందు తుది జాబితా అంటూ ఆరు పేర్లు ఉన్న మరో లిస్ట్‌ ఇచ్చారని ఆయన చెప్పారు.

ఇక తుది జాబితా నుంచి సుఖ్‌బీర్, జ్ఞానేశ్‌ల పేర్లను ప్యానెల్‌లోని మెజారిటీ సభ్యులు ఖరారు చేశారని ఆయన తెలిపారు. ఈ ప్రతిపాదిత పేర్లలో ఆ ఇద్దరినే ఎంపిక చేశారనేది తనకైతే అర్థంకాలేదని ఆయన చెప్పారు. సుప్రీంకోర్టు గత తీర్పు ప్రకారం భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ఈ ఎంపిక కమిటీలో ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ప్యానెల్‌లో మోడీ, అధీర్‌తోపాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా సభ్యులుగా ఉన్నారు. చీఫ్‌ జస్టిస్‌ ఆఫ్‌ ఇండియాకు బదులుగా ప్యానెల్‌లో కేంద్ర మంత్రికి స్థానం కల్పించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై శుక్రవారం కోర్టులో విచారణ జరగనుంది.

First Published:  15 March 2024 9:27 AM IST
Next Story