Telugu Global
National

ఢిల్లీలో 52 డిగ్రీల ఉష్ణోగ్రత.. క్లారిటీ ఇచ్చిన ఐఎండీ

కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు సైతం ఈ వార్తలపై స్పందించారు. ఢిల్లీలో 52.9 డిగ్రీల ఉష్ణోగ్రతపై నివేదిక కోరినట్లు ట్వీట్ చేశారు.

ఢిల్లీలో 52 డిగ్రీల ఉష్ణోగ్రత.. క్లారిటీ ఇచ్చిన ఐఎండీ
X

దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తరాదిలోనూ భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో పాటు వేడిగాలుల కారణంగా జనం అల్లాడుతున్నారు. ఇప్పటివరకూ ఢిల్లీలో 2002లో నమోదైన 49.2 డిగ్రీల ఉష్ణోగ్రతే అత్యధికం, కాగా బుధవారం దేశ రాజధాని ఢిల్లీ శివారులోని ముంగేష్‌పూర్‌లో 52.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు షాకింగ్ వార్తలు వచ్చాయి.

అయితే ఈ వార్తలపై తాజాగా భారత వాతావరణ శాఖ స్పందించింది. సెన్సార్‌లో లోపాలు లేదా స్థానిక కారణాల వల్ల ఈ రీడింగులు వచ్చినట్లు అనుమానం వ్యక్తం చేసింది. ఢిల్లీ నేషనల్ కేపిటల్ రీజియన్ - NCR లోని వివిధ ప్రాంతాల్లో 45.2 డిగ్రీల నుంచి 49.1 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కానీ మిగతా ప్రాంతాలకు భిన్నంగా ముంగేష్‌పూర్‌లో మాత్రం అత్యధికంగా 52.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం షాక్‌కు గురి చేసింది. దీంతో అలర్ట్ అయిన ఐఎండీ డేటాతో పాటు సెన్సార్లను తనిఖీ చేస్తున్నట్లు తెలిపింది.

కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు సైతం ఈ వార్తలపై స్పందించారు. ఢిల్లీలో 52.9 డిగ్రీల ఉష్ణోగ్రతపై నివేదిక కోరినట్లు ట్వీట్ చేశారు. మంగళవారంతో పోల్చితే ముంగేష్‌పూర్‌లో నమైదైన 52.9 డిగ్రీల ఉష్ణోగ్రత 3 డిగ్రీలు అత్యధికం. ముంగేష్‌పూర్‌ భౌగోళికంగా ఢిల్లీ శివారులో ఉండడం కూడా విపరీతమైన వేడికి కారణమంటున్నారు అధికారులు. రాజస్థాన్‌ నుంచి వచ్చే వేడిగాలులు ఢిల్లీలో మొదటగా ప్ర‌వేశించే ప్రాంతాల్లో ముంగేష్‌పూర్‌ ఒకటని చెప్తున్నారు.

First Published:  30 May 2024 7:00 AM GMT
Next Story