Telugu Global
National

వందే భారత్‌ రైలులో భోజనంలో బొద్దింక

తన అత్తయ్య, మామయ్య భోపాల్‌ నుంచి ఆగ్రాకు వందేభారత్‌ రైలులో ప్రయాణించారని, ఆ సమయంలో రైల్వే సిబ్బంది తీసుకొచ్చిన భోజనంలో వడ్డించిన పప్పులో బొద్దింక రావడంతో షాక్‌కి గురయ్యారని ఒక వ్యక్తి ‘ఎక్స్‌’ వేదికగా రైల్వే శాఖకు ఫిర్యాదు చేశారు.

వందే భారత్‌ రైలులో భోజనంలో బొద్దింక
X

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన సెమీ హైస్పీడ్‌ వందే భారత్‌ రైళ్లలో భోజన సదుపాయాల విషయంలో ప్రయాణికుల నుంచి తరచూ ఫిర్యాదులు వస్తున్నాయి. ఆహారం నుంచి దుర్వాసన రావడం, పెరుగులో ఫంగస్‌ కనిపించడం వంటి ఘటనలు గతంలో చర్చకు దారి తీశాయి. ప్రయాణికులు కూడా తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. తాజాగా అలాంటి ఘటనే వందే భారత్‌ రైలులో ప్రయాణించిన దంపతులకు ఎదురైంది.

తన అత్తయ్య, మామయ్య భోపాల్‌ నుంచి ఆగ్రాకు వందేభారత్‌ రైలులో ప్రయాణించారని, ఆ సమయంలో రైల్వే సిబ్బంది తీసుకొచ్చిన భోజనంలో వడ్డించిన పప్పులో బొద్దింక రావడంతో షాక్‌కి గురయ్యారని ఒక వ్యక్తి ‘ఎక్స్‌’ వేదికగా రైల్వే శాఖకు ఫిర్యాదు చేశారు. ప్రయాణికుల ఆరోగ్య సమస్యలపై రైల్వేశాఖ దృష్టి సారించాల్సిన అవసరం ఉందని, క్యాటరింగ్‌ యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన తన ఫిర్యాదులో కోరారు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ అధికార ఖాతాను కూడా తన ఫిర్యాదుకు ట్యాగ్‌ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

నాసిరకం భోజనంపై వచ్చిన ఫిర్యాదుకు ఐఆర్‌సీటీసీ స్పందిస్తూ.. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలిపింది. అందుకు క్షమాపణలు కోరుతున్నామని, ఈ విషయంలో సంబంధిత సర్వీస్‌ ప్రొవైడర్‌పై చర్యలు చేపడతామని పేర్కొంది. మరోసారి ఇలాంటి తప్పిదాలు జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చింది. సాధారణ రైళ్లతో పోలిస్తే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన సెమీ హైస్పీడ్‌ వందే భారత్‌ టికెట్‌ ధర కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ చాలా మంది దీనిలో ప్రయాణించేందుకు మక్కువ చూపుతున్నారు. ప్రయాణం సౌకర్యంగా ఉండటంతో పాటు తొందరగా గమ్యస్థానాలకు చేరుకుంటామనే ఆలోచనే ఇందుకు కారణం. కానీ, ఈ రైళ్లలోని భోజన సదుపాయాలపై తరచూ ప్రయాణికుల నుంచి వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో రైల్వే శాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది చూడాలి.

First Published:  21 Jun 2024 4:12 AM GMT
Next Story