Telugu Global
National

పరీక్షల్లో తప్పినందుకు తల్లి మందలిస్తోందని చంపేశాడు – ఒంటరి అవుతాడని తమ్ముడినీ హతమార్చిన వైనం

కన్న కొడుకును మందలించడమే ఆ తల్లికి శాపమైంది. కొడుకే కాలయముడై కన్నతల్లిని హతమార్చాడు. అదే క్రమంలో తమ్ముడినీ చంపేశాడు.

పరీక్షల్లో తప్పినందుకు తల్లి మందలిస్తోందని చంపేశాడు – ఒంటరి అవుతాడని తమ్ముడినీ హతమార్చిన వైనం
X

కన్న కొడుకును మందలించడమే ఆ తల్లికి శాపమైంది. కొడుకే కాలయముడై కన్నతల్లిని హతమార్చాడు. అదే క్రమంలో తమ్ముడినీ చంపేశాడు. కొడుకు భవిష్యత్తు ఏమవుతుందో, చదువు లేకపోతే జీవితంలో ఎలాంటి ఇబ్బందులు పడతాడోనని తల్లడిల్లిన ఆ తల్లి మనసు.. ఆ కొడుక్కి అర్థం కాలేదు. పరీక్షల్లో తప్పినందుకు పదే పదే మందలించడాన్ని తట్టుకోలేకపోయాడు. విచక్షణ మరిచి ఆమె ఉసురు తీసేందుకు తెగించాడు. తమిళనాడులో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

చెన్నై తిరువొట్రియూర్‌ తిరునగర్‌కు చెందిన పద్మ (45) ఆక్యుపంక్చర్‌ వైద్యురాలు. ఆమె భర్త మురుగన్‌ ఒమన్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు నితీష్‌ (20) బీఎస్సీ, చిన్న కుమారుడు సంజయ్‌ (14) పదో తరగతి చదువుతున్నారు. నితీష్‌ ఈ ఏడాది డిగ్రీ పరీక్షల్లో ఫెయిలయ్యాడు. దీంతో తల్లి పద్మ అతన్ని మందలించింది. దీంతో రెండు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత స్నేహితులు సర్దిచెప్పడంతో తిరిగి ఇంటికొచ్చాడు.

ఆ తర్వాత కూడా తల్లి మందలిస్తూనే ఉండటంతో ఈ నెల 19వ తేదీ రాత్రి నితీష్‌ ఆమె ప్రాణాలు తీశాడు. అదే క్రమంలో తమ్ముడు సంజయ్‌ని కూడా గొంతు కోసి చంపేశాడు. ఆ తర్వాత వారి మృతదేహాలను ఏంచేయాలో అర్థంగాక గోనెసంచిలో కట్టి ఉంచాడు. 21వ తేదీ శుక్రవారం రాత్రి తన పెద్దమ్మ కుమార్తె మహాలక్షి్మ ఇంటికి వెళ్లిన నితీష్‌.. తన సెల్‌ఫోన్, ఇంటి తాళాలు ఒక సంచిలో పెట్టి ఎవరికీ చెప్పకుండా దానిని అక్కడ వదిలేసి వెళ్లిపోయాడు. ఆ తర్వాత సంచిని గమనించిన మహాలక్షి్మ.. సెల్‌ఫోన్‌ను ఆన్‌ చేసి చూడగా వాయిస్‌ మెసేజ్‌లు కనిపించాయి. వాటిలో ‘తాళాలు తీసుకొని ఇంటికి వెళ్లి చూడు‘ అని మాత్రమే ఉండటంతో వెంటనే ఆమె అక్కడికి వెళ్లింది.

ఇంటి తాళాలు తీసి చూడగా.. పద్మ, సంజయ్‌ మృతదేహాలు గోనెసంచిలో కనిపించాయి. వెంటనే కంగారుపడిన ఆమె పోలీసులకు సమాచారం అందించింది. దీనిపై వెంటనే అప్రమత్తమైన పోలీసులు నితీష్‌ కోసం గాలింపు చేపట్టి కాశిమేడు ఫిషింగ్‌ హార్బర్‌ వద్ద ఉండగా అతన్ని అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో నేరాన్ని అంగీకరించిన అతను.. పరీక్షల్లో తప్పడంపై తల్లి తిడుతూనే ఉండటాన్ని తట్టుకోలేక చంపేశానని చెప్పాడు. తమ్ముడు ఒంటరి వాడవుతాడని అతన్నీ గొంతు కోసి చంపేశానని తెలిపాడు.

First Published:  23 Jun 2024 4:50 AM GMT
Next Story