Telugu Global
National

ఉత్కంఠకు తెర.. ఒడిశాలో సీనియర్ కే సీఎం పోస్ట్

సీనియర్ నేత మోహన్ మాఝీ ముఖ్యమంత్రి పీఠం ఎక్కబోతున్నారు. ఎన్నికల ఫలితాలు విడుదలైన వారం రోజులకు సీఎం ఎవరనేది బీజేపీ తేల్చడం విశేషం.

ఉత్కంఠకు తెర.. ఒడిశాలో సీనియర్ కే సీఎం పోస్ట్
X

ఒడిశా కొత్త సీఎంని బీజేపీ అధిష్టానం ఎంపిక చేసింది. సీనియర్ నేత మోహన్ మాఝీకి అవకాశం ఇచ్చింది. ఒడిశాలోని బీజేపీీ సీనియర్ నేతల్లో మాఝీ ఒకరు. ఇప్పటి వరకు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈసారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కబోతున్నారు. ఎన్నికల ఫలితాలు విడుదలైన వారం రోజులకు సీఎం ఎవరనేది బీజేపీ తేల్చడం విశేషం.

ఒడిశాలో మొత్తం 147 స్థానాలకు గాను 78 స్థానాల్లో బీజేపీ విజయం సాధించి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ పొందింది. ఊహించని ఈ విజయం తర్వాత సీఎం పోస్ట్ పై ఉత్కంఠ పెరిగింది. ఒడిశా నుంచి ఆ పార్టీ ఎంపీగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్‌ను సీఎంగా చేయవచ్చనే ఊహాగానాలు వినిపించినా, ఆయనకు అనూహ్యంగా కేంద్రంలో విద్యాశాఖ లభించింది. మరో నేత సురేష్ పూజారి పేరు కూడా వినిపించినా, చివరకు మోహన్ మాఝీని అదృష్టం వరించింది.

అన్నీ కొత్తగానే..

నవీన్ పట్నాయక్ ఒడిశాకు 24 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అక్కడ ప్రభుత్వం అంటే బిజూ జనతాదళ్, బీజేడీ అంటే ప్రభుత్వం అన్నట్టుగా పరిస్థితులున్నాయి. తొలిసారి బీజేపీ అక్కడ సొంతగా ప్రభుత్వ ఏర్పాటుకి సిద్ధమైంది. నవీన్ పట్నాయక్, రాజధాని భువనేశ్వర్ లోని తన సొంత ఇంటి నుంచే పాలన కొనసాగించేవారు. 24 ఏళ్లుగా ఆయన నవీన్ నివాస్ నుంచే పనిచేసేవారు. ఇప్పుడు కొత్తగా అక్కడ ముఖ్యమంత్రి కోసం కార్యాలయం వెదుకుతున్నారు. ఒడిశాపై బీజేడీ మార్కు తొలగించి, బీజేపీ మార్కు వేయాలని చూస్తోంది కమలదళం.

First Published:  11 Jun 2024 1:18 PM GMT
Next Story