Telugu Global
National

భార్య‌ గెలుపు కోసం పొర్లు దండాలు పెట్టిన హీరో

అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన శరత్‌కుమార్‌.. అనంతరం ఆలయ ప్రాంగణంలో పొర్లు దండాలు పెట్టారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి.

భార్య‌ గెలుపు కోసం పొర్లు దండాలు పెట్టిన హీరో
X

తన సతీమణి, వెండి తెరపై చెరిగిపోని ముద్ర వేసిన సినీ నటి రాధిక ఎన్నికల్లో గెలుపొందాలని కాంక్షిస్తూ ఆమె భర్త శరత్‌కుమార్‌ గుడికి వెళ్లి పొర్లు దండాలు పెట్టడం నెట్టింట వైరల్‌గా మారింది. తమిళనాడులోని విరుద్‌నగర్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా రాధిక పోటీ చేసిన విషయం తెలిసిందే. కౌంటింగ్‌ తేదీ దగ్గరపడిన నేపథ్యంలో ఆదివారం రాత్రి విరుద్‌నగర్‌లోని శ్రీపరాశక్తి మారియమ్మన్‌ ఆలయాన్ని రాధిక దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన శరత్‌కుమార్‌.. అనంతరం ఆలయ ప్రాంగణంలో పొర్లు దండాలు పెట్టారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. రాధిక తరఫున ఎన్నికల ప్రచారంలోనూ శరత్‌కుమార్‌ చురుగ్గా పాల్గొన్నారు.

2006లో రాధిక రాజకీయ ప్రస్థానం మొదలైంది. తన భర్త శరత్‌ కుమార్‌తో కలసి ఆమె అన్నాడీఎంకేలో చేరారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ అదే ఏడాది ఆ పార్టీ అగ్ర నాయకత్వం వారిని తొలగించింది. 2007లో వారు ఆల్‌ ఇండియా సమతువ మక్కల్‌ కట్చి (ఏఐఎస్‌ఎంకే) పార్టీని స్థాపించారు. దానికి ఉపాధ్యక్ష హోదాలో ఆమె సేవలు అందించారు. కొద్దిరోజుల క్రితం ఏఐఎస్‌ఎంకేను బీజేపీలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమెకు బీజేపీ ఎంపీ టికెట్‌ దక్కింది.

మరోపక్క విరుద్‌నగర్‌ స్థానం నుంచి రాధికకు బలమైన పోటీ ఉంది. దివంగత నటుడు కెప్టెన్‌ విజయకాంత్‌ కుమారుడు విజయ ప్రభాకరన్‌ ఇదే స్థానం నుంచి బరిలో ఉన్నారు. అన్నాడీఎంకేతో పొత్తులో భాగంగా డీఎండీకే తరపున ఆయన పోటీ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్‌ నుంచి సిట్టింగ్‌ ఎంపీ మాణిక్కం ఠాగూర్‌ మరోసారి పోటీ చేశారు. దీంతో ఇక్కడ త్రిముఖ పోరు నెలకొంది. ఈ పోరులో విజేత ఎవరనేది మంగళవారం నాటి ఓట్ల లెక్కింపుతో తేలిపోనుంది.

First Published:  3 Jun 2024 2:30 PM GMT
Next Story