Telugu Global
National

తమిళనాడులో కల్తీ మద్యం తాగి 33 మంది మృతి

మృతుల్లో చాలామంది దినసరి కూలీలే. వారిలో కొందరు మహిళలు కూడా ఉన్నారు. సారా తాగిన వెంటనే బాధితులు ఒక్కసారిగా వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి, కళ్లమంటతో అవస్థలు పడ్డారు.

తమిళనాడులో కల్తీ మద్యం తాగి 33 మంది మృతి
X

కల్తీ మద్యం తాగి తమిళనాడు రాష్ట్రంలో 33 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 70 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉంది. కల్లకురిచి జిల్లా కరుణాపురంలో జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనమైంది. దీనిని తీవ్రంగా పరిగణించిన ముఖ్యమంత్రి స్టాలిన్ కల్లకురిచి జిల్లా కలెక్టర్ శ్రావణ్‌కుమార్ జటావత్‌ను బదిలీ చేసి, ఎస్పీ సామే సింగ్ మీనాను సస్పెండ్ చేశారు. వీరితోపాటు మరో 9 మందిని కూడా సస్పెండ్‌ చేశారు. ఘటనపై సీబీసీఐడీ దర్యాప్తునకు ఆదేశించారు. కొత్తగా వచ్చిన కలెక్టరు ప్రశాంత్, ఎస్పీ చతుర్వేది పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. సారాను విక్రయించే గోవిందరాజ్ అనే వ్యక్తిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. అతడి నుంచి 200 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నారు.

మృతుల్లో చాలామంది దినసరి కూలీలే. వారిలో కొందరు మహిళలు కూడా ఉన్నారు. సారా తాగిన వెంటనే బాధితులు ఒక్కసారిగా వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి, కళ్లమంటతో అవస్థలు పడ్డారు. వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి స్టాలిన్ తీవ్రంగా స్పందించారు ఈ ఘటనతో ప్రమేయం ఉన్న వారిని అరెస్ట్ చేశామని, సారాను నియంత్రించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. సమాజాన్ని నాశనం చేసే ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై తక్షణమే చర్యలు తీసుకుంటాం అని ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు.

మరోవైపు ప్రజల ప్రాణాలు పోతున్నా స్టాలిన్ ప్రభుత్వం మొద్దునిద్ర వీడటంలేదని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కల్లకురిచి ఘటనకు ప్రభుత్వానిదే బాధ్యత అని.. సారాను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్ష నేత పళనిస్వామి విమర్శించారు. ఎక్సైజ్‌శాఖ మంత్రి ఎస్. ముత్తుస్వామి రాజీనామా చేయాలని తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై డిమాండ్ చేశారు.

First Published:  20 Jun 2024 6:38 AM GMT
Next Story