కర్ణాటక ప్రభుత్వ స్కూళ్లలో పల్లీపట్టీల పంపిణీని నిలిపివేత.. ఎందుకంటే?
ఇటీవల జరిపిన పరీక్షల్లో అత్యధికంగా చెక్కర, హాని కలిగించే కొవ్వులు ఉన్నట్లు గుర్తించిన అధికారులు

కర్ణాటకలోని ప్రభుత్వ స్కూళ్లలో ఇక నుంచి పల్లీపట్టీల పంపిణీని నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల జరిపిన పరీక్షల్లో అత్యధికంగా చెక్కర, హాని కలిగించే కొవ్వులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇవి పిల్లల ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపే ప్రమాదం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. గడువు తీరిన, సరిగా నిల్వ చేయని పల్లీపట్టీలు కూడా ఉండటంతో పంపిణీ నిలిపివేస్తున్నామని ధార్వాడ్ డిప్యూటీ కమిషనర్ (పాఠశాల విద్య) పేర్కొన్నారు.
మధ్యాహ్న భోజన పథకం కింద పాఠశాలల్లో పల్లీపట్టీలకు బదులుగా గుడ్డు లేదా అరటిపండు పంపిణీ చేయాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. 2021 నుంచి మధ్యాహ్న భోజన సమయంలో గుడ్లు తినని పాఠశాల విద్యార్థుల కోసం కర్ణాటక ప్రభుత్వం అరటిపండ్లను లేదా పల్లీలు-బెల్లంతో చేసిన చిక్కీలను పంపిణీ చేస్తున్నది. 2022 డిసెంబర్లో ఇండియన్ ఎక్స్ప్రెస్కు పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ డిపార్ట్మెం్ అందించిన డేటా ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 2.27 లక్షల మంది పిల్లలు మాత్రమే వీటిని ఎంచుకోగా సుమారు 80 శాతం మంది విద్యార్థులు గుడ్లను ఎంచుకుంటున్నారు.