ఏపీ సీఐడీ విచారణకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి హాజరు
ఇదే కేసులో ఇప్పటికే విజయసాయిరెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు.

ఏపీ సీఐడీ విచారణకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి హాజరయ్యారు. కాకినాడ పోర్టు అక్రమాల కేసులో ఆయన సీఐడీ ఆఫీసుకు వెళ్లారు. ఇదే కేసులో ఇప్పటికే విజయసాయిరెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. జగన్ హయాంలో కాకినాడ సీ పోర్టు లిమిటెడ్ (కేఎస్పీఎల్), కాకినాడ సెజ్ (కేసెజ్)ల్లో రూ. 3,600 కోట్ల విలువైన వాటాలను వాటి యజమాని కర్నాటి వెంకటేశ్వరావు (కేవీ రావు) నుంచి బలవంతంగా గుంజుకున్న కేసులో వైసీపీ నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఏపీ సీఐడీ ఇటీవల నోటీసులు ఇచ్చింది. బుధవారం విజయవాడ సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నది. ఈ కేసులో విజయసాయిరెడ్డి రెండో నిందితు (ఏ2) కాగా, వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి ఏ1గా ఉన్నారు. కేఎన్పీఎల్, కేసెజ్ల్లో వాటాలు గుంజుకున్న వ్యవహారంలో మనీలాండరింగ్ జరిగినట్లు ఈడీ గుర్తించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద అభియోగాలు మోపి కేసు నమోదు చేసింది. రెండు నెలల కిందట సాయిరెడ్డిని ఈడీ విచారించింది. ఇదే వ్యవహారంలో సీఐడీ నోటీసులు ఇవ్వడంతో విజయసాయిరెడ్డి హాజరయ్యారు.