ఆర్టీసీ బస్సులో 'తండేల్'.. విచారణకు ఛైర్మన్ ఆదేశం
ఈ ఘటనపై ఎంక్వైరీ చేసి వివరాలు సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్న కొనకళ్ల నారాయణరావు
![ఆర్టీసీ బస్సులో తండేల్.. విచారణకు ఛైర్మన్ ఆదేశం ఆర్టీసీ బస్సులో తండేల్.. విచారణకు ఛైర్మన్ ఆదేశం](https://www.teluguglobal.com/h-upload/2025/02/11/1402279-tandel.webp)
నాగచైతన్య, సాయిపల్లవి నటించిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ 'తండేల్'. ఈ మూవీ విడుదలైన నాటి నుంచి దీన్ని పైరసీ దీన్ని వేధిస్తున్న విషయం విదితమే. ఈ సినిమా రిలీజ్ అయిన రెండు రోజుల్లోనే ఏపీఎస్ఆర్టీసీ బస్సులో దీన్ని ప్రదర్శించడం చర్చనీయాంశమైంది. దీనిపై నిర్మాత బన్నివాసు స్పందించారు. దీనికి పాల్పడిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని ఏపీఎస్ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావును బన్నివాసు కోరారు. దీంతో ఏపీఎస్ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు తాజాగా దీనిపై విచారణకు ఆదేశించారు. ఈ ఘటనపై ఎంక్వైరీ చేసి వివరాలు సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
నిర్మాత సంస్థ ఛైర్మన్ కు విజ్ఞప్తి చేస్తూ పోస్టు పెట్టారు 'ఓ మీడియా సంస్థలో వచ్చిన వార్త ద్వారా ఏపీఎస్ఆర్టీసీ బస్సులో తండేల్లో ప్రదర్శించారని తెలుసుకున్నాం. ఇది చట్టవిరుద్ధం, అన్యాయం మాత్రమే కాదు సినిమాకు జీవం పోయడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్న ఎంతోమంది వ్యక్తులను అవమానించడమే. ఒక సినిమా ఎంతో మంది ఆర్టిస్టులు, డైరెక్టర్లు, నిర్మాతల కల' అని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్గా మారింది.