Telugu Global
Cinema & Entertainment

ఈ ముగ్గురూ ఇండియన్ ‘ఎవెంజర్స్’ నిజమేనా?

‘కేజీఎఫ్’ ఫేమ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ముగ్గురు బిగ్ స్టార్స్ కాంబినేషన్ లో తన ‘మైన్ యూనివర్స్’ ని ‘ఎవెంజర్స్’ రేంజికి తీసికెళ్ళబోతున్నాడా? ప్రభాస్, ఎన్టీఆర్, యష్ లు ‘కెప్టెన్ అమెరికా’, ‘థోర్’, ‘ఐరన్ మాన్’ లాగా కనిపించబోతున్నారా? ఈ ఊహాగానాలు బాలీవుడ్ లో వైరల్ అవుతున్నాయి.

ఈ ముగ్గురూ ఇండియన్ ‘ఎవెంజర్స్’ నిజమేనా?
X

‘కేజీఎఫ్’ ఫేమ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ముగ్గురు బిగ్ స్టార్స్ కాంబినేషన్ లో తన ‘మైన్ యూనివర్స్’ ని ‘ఎవెంజర్స్’ రేంజికి తీసికెళ్ళబోతున్నాడా? ప్రభాస్, ఎన్టీఆర్, యష్ లు ‘కెప్టెన్ అమెరికా’, ‘థోర్’, ‘ఐరన్ మాన్’ లాగా కనిపించబోతున్నారా? ఈ ఊహాగానాలు బాలీవుడ్ లో వైరల్ అవుతున్నాయి. ఒకే మూవీలో ఈ ముగ్గురు స్టార్స్ ని గనుక తీసుకు రాగలిగితే ఇండియన్ స్క్రీన్ మీదే అదొక భారీ సంచలనమే అవుతుంది. నిజానికి ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో ఒక మూవీ ప్లాన్ చేస్తున్నట్టు మొన్నటి వరకూ వచ్చిన వార్తలు. ప్రభాస్ తో ‘సాలార్’ తర్వాత ఎన్టీఆర్ తో వుంటుందని స్వయంగా తానే ప్రకటించాడు. ఇప్పుడా ప్రాజెక్టుని కూడా డ్రాప్ చేసి అంతకన్నా భారీ ప్రాజెక్టుకి పూనుకోబోతున్నట్టు బాలీవుడ్ నుంచి సమాచారం.

2018లో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘కేజీఎఫ్ : చాప్టర్ 1’ పెద్ద రేంజిలో బాక్సాఫీసు హిట్ అయింది. యష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ కన్నడ మూవీ నార్త్ లో కూడా వూరూరా దూసుకెళ్ళింది. 2022లో దీనికి సీక్వెల్‌ని విడుదల చేశాడు. ఇది కూడా బ్లాక్ బస్టర్ అయింది. 2023లో ప్రభాస్ తో ‘సాలార్ : పార్ట్ 1-ది సీజ్ ఫైర్’ విడుదల చేశాడు. ఇది కూడా బాక్సాఫీసుని బద్దలు కొట్టింది. దీంతో ‘సాలార్ 2’ ప్రకటించినా, మరోవైపు ఎన్టీఆర్ తో వేరే మూవీ కూడా ప్రకటించాడు. ఈ సినిమా కూడా మైన్ బ్యాక్‌డ్రాప్‌లో వుంటుందని సమాచారం వెలువడింది.

ఇలా మార్చి నెలలో ఎన్టీఆర్, రిషభ్ శెట్టిలతో కొత్త మూవీని ప్రకటించడంతో ఫ్యాన్స్ ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంది. అయితే ఈ ప్రాజెక్ట్ ప్రస్తుత కమిట్‌మెంట్‌లు పూర్తయిన తర్వాత మాత్రమే ప్రారంభమవుతుందని చెప్పాడు. ప్రస్తుత కమిట్ మెంట్లలో ‘సాలార్ 2’ ఒకటి. అయితే ప్రశాంత్ నీల్ తన ‘కేజీఎఫ్’, ‘సాలార్’ సినిమాలని ఒకే యూనివర్స్ కిందికి తీసుకు వచ్చే ఆలోచనతో వున్నట్టు తెలుస్తోంది. రెండు సినిమాల్లోనూ సాధారణ అంశం ‘మైన్స్’ కాబట్టి, మూడో సినిమాని ఆ ‘మైన్ యూనివర్స్’ లో భాగంగా వుంటుందని తెలుస్తోంది.

ఈ ‘మైన్ యూనివర్స్’ ఫైనల్ మూవీలో ప్రభాస్, ఎన్టీఆర్, యష్ లని భాగం చేయబోతున్నట్టు బాలీవుడ్ లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రశాంత్ నీల్ ‘కేజీఎఫ్ 3’ ని 'అవెంజర్స్: ఎండ్‌గేమ్'గా మార్చాలని యోచిస్తున్నట్టు, దీంతో ఇది ‘మైన్ యూనివర్స్’ ముగింపుని సూచించినట్టవుతుందని చెప్పుకుంటున్నారు. కాబట్టి, ఎండ్‌గేమ్‌లో ‘ఎవెంజర్స్’, ‘కెప్టెన్ అమెరికా’, ‘థోర్’, ‘ఐరన్ మాన్’ లని కలిపి చూపినట్టే, ఇండియన్ స్క్రీన్‌పై ప్రభాస్, ఎన్టీఆర్, యష్‌లని కలిపి చూసే అవకాశం లభిస్తుందన్న మాట.

ప్రశాంత్ నీల్ డైనమిక్ యాక్షన్ యూనివర్స్ అనేక విధాలుగా ప్రత్యేకమైనది. మొదటిది, ఇది నిజమైన పాన్-ఇండియన్ యీనివర్స్. ‘కేజీఎఫ్’ సినిమాల్లో వివిధ పాత్రల్లో దేశం నలుమూలల నుంచీ నటులు కనిపిస్తారు. ఇవి బహుళ భాషల్లోకి డబ్ కూడా అయ్యాయి. ఇలా ఈ సినిమాలు విస్తృత స్థాయిలో ప్రేక్షకుల అందుబాటులోకి వచ్చాయి. ఫలితంగా ఇవి బ్లాక్‌బస్టర్‌లుగా నిలబడ్డాయి.

రెండవది, నీల్ యాక్షన్ యూనివర్స్ భారీ హింసతో కూడి వుంటుంది. స్లో-మోషన్ యాక్షన్ సన్నివేశాలు, భౌతిక సూత్రాల్ని ధిక్కరించే విన్యాసాలు, పేలుడు పోరాట సన్నివేశాలూ ప్రత్యేకంగా వుంటాయి. పాత్రలు కూడా మానవాతీత శక్తి సామర్థ్యాలతో వుంటాయి.

మూడవది, ప్రశాంత్ నీల్ యాక్షన్ యూనివర్స్ ఒక ప్రత్యేక ప్రపంచంలో - కథా లోకంలో సెట్ చేసి వుంటుంది. ‘కేజీఎఫ్’ సినిమాలు కర్ణాటకలోని కల్పిత కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో కథని కలిగి వుంటాయి. దీంతో ఇవి మైనర్లు, గ్యాంగ్‌స్టర్‌లు, పొలిటీషియన్లు సహా మరెన్నో పాత్రల్ని కలిగి వుంటాయి. ఇలా ఇవి ఒక నమ్మదగిన, అద్భుత ప్రపంచాన్ని కళ్ళ ముందుంచుతాయి.

చివరిగా, నీల్ యాక్షన్ యూనివర్స్ బలమైన సామాజిక, రాజకీయ సందేశాల్ని కూడా కలిగి వుంటుంది. వర్గ తారతమ్యాలు, అవినీతి, ధన బలం వంటి కథనాలని చిత్రిస్తాయి. పాత్రలు సంక్లిష్టమైనవిగా వుంటాయి. మంచివాళ్ళుగా, చెడ్డవాళ్ళుగా పాత్రలు వాటి వాటి మనుగడల కోసం, సొంత లక్ష్యాల కోసం పోరాడతాయి.

వీటన్నిటి దృష్ట్యా ప్రభాస్, ఎన్టీఆర్, యష్ మెగా స్టార్లు ముగ్గురూ గనుక ఒకే తెరపై కొచ్చి యాక్షన్ లోకి దిగితే వెండి తెరలు చిరిగిపోవడం ఖాయం!

First Published:  13 May 2024 9:45 AM GMT
Next Story