Telugu Global
Cinema & Entertainment

సినిమా వాళ్లను టార్గెట్‌ చేయడం సిగ్గుచేటు

మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలపై మండిపడిన మెగాస్టార్‌

సినిమా వాళ్లను టార్గెట్‌ చేయడం సిగ్గుచేటు
X

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను విమర్శించే క్రమంలో సమంత, నాగచైతన్య, ,నాగార్జున పేర్లను ప్రస్తావిస్తూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆమె వ్యాఖ్యలపై సినీ, రాజకీయ ప్రముఖులు, నెటిజన్లు మండిపడుతున్నారు. తాజాగా మంత్రి వ్యాఖ్యలపై టాలీవుడ్‌ అగ్ర హీరో మెగాస్టార్‌ చిరంజీవి స్పందించారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టారు.

'గౌరవనీయులైన మహిళా మంత్రి చేసిన అవమానకర వ్యాఖ్యలు చూసి నేను చాలా బాధపడ్డాను. త్వరితగతిన వార్తల్లో నిలువడానికి సెలబ్రిటీలు, సినీ కుటుంబానికి చెందిన వ్యక్తులను సాఫ్ట్‌ టార్గెట్‌ చేసుకోవడం సిగ్గు చేటు. సినీ పరిశ్రమకు చెందిన సభ్యులపై ఇలాంటి మాటల దాడులను మేమంతా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నాం. రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులు, మరీ ముఖ్యంగా మహిళలపై ఇలాంటి ఆరోపణలు చేసి దిగజారవద్దు. సమాజాభివృద్ధి కోసం మేము మా నాయకులను ఎన్నుకుంటాం. ఇలాంటి వ్యాఖ్యలు చేసి వారు తమ స్థాయిని తగ్గించుకోకూడదు. రాజకీయ నాయకులు, గౌరవప్రదమైన స్థానాల్లో ఉన్నవారు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలువాలి' అని పేర్కొన్నారు.


First Published:  3 Oct 2024 4:15 AM GMT
Next Story