భారత్-ఈయూ మధ్య స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం!
ఇది జరిగితే ప్రపంచంలోనే అతిపెద్ద ఒప్పందంగా నిలిచే అవకాశం ఉందన్న ఈయూ అధ్యక్షురాలు

భారత్, యూరొపియన్ యూనియన్ (ఈయూ) మధ్య జరిగే స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం ప్రపంచంలోనే అతిపెద్ద ఒప్పందంగా యురోపియన్ యూనియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డేరే లేయెన్ అన్నారు. ఈ ఏడాది చివరికల్లా ఆ ఒప్పందం జరగాలని ఇరువైపులా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఢిల్లీలో జరిగిన మేధోమథన సదస్సులో పాల్గొన్న ఈయూ అధ్యక్షురాలు ఉర్సులా జపాన్, దక్షిణ కొరియా మాదిరిగానే భారత్లోనూ భవిష్యత్తు భద్రత, రక్షణ ఒప్పందాలు చేసుకోవాలని ఈయూ భావిస్తున్నట్లు చెప్పారు. ప్రధాని మోడీతో విస్తృతస్థాయి చర్చలకు ముందు ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా భయాలు నెలకొన్నాయని అన్నారు. భారతీయులు తమ భాగస్వామ్యాన్ని పెంచుకోవడానికి ప్రస్తుతం నెలకొన్న పోటీ ఓ గొప్ప అవకాశమని ఈయూ అధ్యక్షురాలు పేర్కొన్నారు. భారత్-ఈయూలో తమ వ్యూహాత్మాక భాగస్వామ్యాన్ని తర్వాత దశకు తీసుకెళ్లడానికి ఇదే మంచి సమయం అన్నారు. వాణిజ్యం, టెక్నాలజీ, భద్రత, రక్షణ , కనెక్టివిటీ, ప్రపంచ భాగస్వామ్యం భారత్ -ఈయూ భాగస్వామ్యాన్ని తర్వాత దశకు తీసుకెళ్తుందని ఈయూ అధ్యక్షురాలు తెలిపారు.