Telugu Global
Andhra Pradesh

మీరైనా జోక్యం చేసుకోండి.. గవర్నర్ కు వైసీపీ ఫిర్యాదు

ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ ప్రతీకార దాడులు జరుగుతున్నాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పోలీసులు కూడా అధికార పార్టీ నేతలతో అంటకాగుతున్నారని అంటున్నారు.

మీరైనా జోక్యం చేసుకోండి.. గవర్నర్ కు వైసీపీ ఫిర్యాదు
X

రాష్ట్రంలో శాంతి భద్రతలు అసలు లేనే లేవని అన్నారు వైసీపీ నేతలు. వైవీ సుబ్బారెడ్డి, అయోధ్య రామిరెడ్డి.. తదితర నేతలు రాష్ట్ర గవర్నర్ ని కలసి కూటమి ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు. వైసీపీ నేతల్ని టార్గెట్ చేసుకుని దాడులకు పాల్పడుతున్నారని, పోలీసులు కూడా వారికే వత్తాసు పలుకుతున్నారని చెప్పారు. గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరారు. ఏపీలో శాంతి భద్రతల్ని పునరుద్ధరించాలంటూ వారు వినతిపత్రం అందించారు.


ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ ప్రతీకార దాడులు జరుగుతున్నాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పోలీసులు కూడా అధికార పార్టీ నేతలతో అంటకాగుతున్నారని అంటున్నారు. రోజులు గడుస్తున్నా దాడులు ఆగకపోగా ఇంకా పెరుగుతున్నాయని, వైసీపీ సానుభూతిపరులు అని తెలిస్తే చాలు టార్గెట్ చేస్తున్నారని అంటున్నారు. నేతలు, కార్యకర్తల్నే కాదు, వైసీపీకి ఓటు వేసినందుకు దళితులపై కూడా టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన దాడి ఘటనలను ప్రస్తావిస్తూ ఓ వినతిపత్రాన్ని ఈరోజు గవర్నర్ కు అందించారు. బాధితులకు భరోసా కల్పించాలని, దాడులు చేసేవారిని నిలువరించాలని కోరారు.

మా ఆఫీసుల్లో మీకు పనేంటి..?

రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ఆఫీస్ లకు ప్రభుత్వం నోటీసులిస్తున్న సంగతి తెలిసిందే. అక్రమ నిర్మాణం అంటూ ఇప్పటికే తాడేపల్లి ఆఫీస్ ని కూల్చివేశారు అధికారులు. మిగతా ఆఫీస్ లకు నోటీసులిచ్చారు. ఈ క్రమంలో వైసీపీ కోర్టుని ఆశ్రయించింది. అయితే టీడీపీ నేతలు తమ ఆఫీసుల్లోకి వచ్చి బెదిరిస్తున్నారని, వైసీపీ ఆఫీస్ లలో వారికి పనేంటని ప్రశ్నిస్తున్నారు నేతలు. దురుద్దేశంతో అక్రమ నిర్మాణాలు అనే ముద్రవేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. కూటమి పాలనతో ప్రజలు అప్పుడే విసుగు చెందారని అన్నారు వైసీపీ నేతలు.

First Published:  29 Jun 2024 4:32 PM GMT
Next Story