Telugu Global
Andhra Pradesh

పిన్నెల్లికి హైకోర్టులో ఊరట.. - 3 కేసుల్లో ముందస్తు బెయిల్‌ మంజూరు

ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా జరిగిన ఘటనలపై పిన్నెల్లిపై ఈవీఎం ధ్వంసానికి సంబంధించి ఒక కేసు నమోదవగా, ఆయన హైకోర్టును ఆశ్రయించారు.

పిన్నెల్లికి హైకోర్టులో ఊరట.. - 3 కేసుల్లో ముందస్తు బెయిల్‌ మంజూరు
X

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై తాజాగా నమోదు చేసిన 3 కేసుల్లో ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. ఈవీఎం ధ్వంసం కేసులో ఇచ్చిన బెయిల్‌ షరతులే ఇందులోనూ వర్తిస్తాయని పేర్కొంది. అంతేకాదు.. ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో పాల్గొనేందుకు పిన్నెల్లికి అనుమతి ఇస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది.

ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా జరిగిన ఘటనలపై పిన్నెల్లిపై ఈవీఎం ధ్వంసానికి సంబంధించి ఒక కేసు నమోదవగా, ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఆ కేసులో ఆయన్ని జూన్‌ 5 వరకు అరెస్టు చేయొద్దని ఈ నెల 23న హైకోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో పోలీసు అధికారులు ఆ తర్వాత ఆయనపై మరో మూడు కేసులు వరుసగా నమోదు చేశారు. ఈ నేపథ్యంలో పిన్నెల్లి మరోసారి హైకోర్టును ఆశ్రయించగా.. ఆయనకు బెయిల్‌ మంజూరు చేస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది.

First Published:  28 May 2024 9:37 AM GMT
Next Story