Telugu Global
Andhra Pradesh

మావి విల్లాలు.. మీవి బంగ్లాలు

టీడీపీ ఆఫీస్ ల వ్యవహారం, అందులోని సౌకర్యాల వ్యవహారం ఇప్పుడు టాక్ ఆఫ్ ఏపీగా మారింది. మావి బంగ్లాలు అయితే, మీవి పూరి గుడిసెలా అంటూ వైసీపీ సూటిగా ప్రశ్నిస్తోంది.

మావి విల్లాలు.. మీవి బంగ్లాలు
X

తాడేపల్లి వైసీపీ ఆఫీస్ కూల్చివేత తర్వాత సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే జరుగుతోంది. అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఒకరి తప్పుల్ని ఒకరు బయటపెట్టుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడిందని, వారి పార్టీ ఆఫీస్ లన్నీ అక్రమ నిర్మాణాలేనని అంటూ టీడీపీ ఆరోపిస్తోంది. దీనికి కౌంటర్ గా వైసీపీ రికార్డులన్నీ బయటపెడుతోంది. అసలు టీడీపీ ఆఫీస్ ల పుట్టు పూర్వోత్తరాలు ఇవీ అంటూ కథనాలు మొదలు పెట్టింది సాక్షి.

రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ఆఫీస్ లు లగ్జరీ హోటల్స్‌ని తలపిస్తున్నాయని, లీజుల ముసుగులో భారీగా భూముల్ని కొట్టేసి కార్యాలయాల్ని కట్టారని, అడ్డగోలు జీవోలతో 33 నుంచి 99 ఏళ్ల పాటు భూములు లీజుకు తీసుకున్నారని కథనాలు ఇస్తున్నారు. సర్కారు స్థలాలు, పేదల భూములను లాక్కొని పచ్చ భవనాలు నిర్మించుకున్న టీడీపీ పెద్దలు సుద్దులు వల్లించడం గురివింద సామెతను గుర్తు చేస్తోందనేది సాక్షి కథనాల సారాంశం.


అంతా బాగానే ఉంది కానీ.. ఈ విషయాలన్నీ వైసీపీ ఇప్పుడు పరిశోధించి బయటపెట్టడం విశేషం. గత ఐదేళ్లలో వైసీపీ అధికారంలో ఉంది, అప్పుడు కూడా టీడీపీ ఆఫీస్ లు అలాగే ఉన్నాయి. పేదల భూములు లాక్కొన్నారని, ప్రభుత్వ భూములు కొట్టేశారని తెలిస్తే మరి అధికారులు ఏం చేస్తున్నారు, వైసీపీ పెద్దలు ఎందుకు చూసీ చూడనట్టు ఉన్నారనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వినపడుతున్నాయి. వైసీపీ ఆఫీస్ కూల్చేసిన తర్వాతే ఈ తప్పులన్నీ ఎందుకు బయటకొస్తున్నాయని అడుగుతున్నారు టీడీపీ నేతలు. అప్పుడు వైసీపీ కూడా అక్రమ భవనాలపై చర్యలు తీసుకుని ఉండొచ్చుకదా అని కొందరు లాజిక్ తీస్తున్నారు. ఈ లాజిక్ లు పక్కనపెడితే.. టీడీపీ ఆఫీస్ ల వ్యవహారం, అందులోని సౌకర్యాల వ్యవహారం ఇప్పుడు టాక్ ఆఫ్ ఏపీగా మారింది. మావి బంగ్లాలు అయితే, మీవి పూరి గుడిసెలా అంటూ వైసీపీ సూటిగా ప్రశ్నిస్తోంది.

First Published:  24 Jun 2024 8:13 AM GMT
Next Story