Telugu Global
Andhra Pradesh

లోకేష్ కి క్షమాపణ చెప్పేవరకు చిత్ర హింసలు.. వైరల్ వీడియో

తాము ప్రతీకార రాజకీయాలకు పాల్పడటంలేదని చెప్పిన చంద్రబాబు ఈ దాడుల్ని సమర్థిస్తారా..? అని ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు. రాష్ట్రంలో అసలు పోలీస్ వ్యవస్థ ఉందా అని అడుగుతున్నారు.

లోకేష్ కి క్షమాపణ చెప్పేవరకు చిత్ర హింసలు.. వైరల్ వీడియో
X

మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని పెదవడ్లపూడిలో జరిగిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైసీపీ కార్యకర్త పాలేటి రాజ్ కుమార్ ని టీడీపీ నేతలు చుట్టుముట్టారు. అతడి బట్టలు ఊడదీసి, నడిరోడ్డుపై కూర్చోబెట్టి చిత్రహింసలు పెట్టారు. మోకాళ్లపై నిలబెట్టి మరీ దాడికి పాల్పడ్డారు. చివరకు చేతులెత్తి లోకేష్ కి మొక్కేలా, క్షమాపణలు చెప్పేలా చేశారు. కాళ్లు పట్టుకుంటాను వదిలేయమని వేడుకున్నారు పాలేటి. లోకేష్ ఫ్లెక్సీ ముందు వైసీపీ కార్యకర్తని మోకాళ్లపై నిలపెట్టి, నడిరోడ్డులో టీడీపీ నేతలు చేసిన అరాచకం ఇప్పుడు వైరల్ గా మారింది.


ఎవరీ పాలేటి..?

పాలేటి రాజ్ కుమార్, కృష్ణవేణి భార్యా భర్తలు. వీరు మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ తరపున యాక్టివ్ గా ఉండేవారు. నేరుగా జగన్ ని కలసి కూడా ఫొటోలు దిగారు. మంగళగిరిలో లోకేష్ కి వ్యతిరేకంగా పనిచేశారు. సోషల్ మీడియాలో కూడా పాలేటి కృష్ణవేణి పలు పోస్టింగ్ లు పెట్టేవారు. అప్పటినుంచే ఈ దంపతులపై టీడీపీ నేతలు రగిలిపోయేవారు. తీరా ఫలితాలు వచ్చాక తమ ప్రతాపం చూపించారు. పాలేటి రాజ్ కుమార్ ని పట్టుకుని చిత్రహింసలు పెట్టారు. ఈ అమానవీయ ఘటనపై తటస్థులు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. గతంలో పాలేటి వ్యాఖ్యల్ని కూడా ఈ సందర్భంగా టీడీపీ వైరల్ చేస్తోంది.


చంద్రబాబు ఏం చెబుతారు..?

తాము ప్రతీకార రాజకీయాలకు పాల్పడటంలేదని చెప్పిన చంద్రబాబు.. ఈ దాడుల్ని సమర్థిస్తారా..? అని ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు. రాష్ట్రంలో అసలు పోలీస్ వ్యవస్థ ఉందా అని అడుగుతున్నారు. పోలీసులు టీడీపీకి వంతపాడుతున్నారని, వైసీపీని టార్గెట్ చేస్తున్నారని మండిపడుతున్నారు. అయితే ఈ గొడవలకు టీడీపీ నుంచి కూడా అదే రీతిలో సమాధానాలు వస్తున్నాయి. గతంలో వైసీపీ నేతలు దాడి చేశారంటూ పాత వీడియోలను టీడీపీ కూడా వైరల్ చేస్తోంది.

First Published:  10 Jun 2024 3:52 AM GMT
Next Story