రూ.30 కోట్లకు టికెట్ అమ్ముకుంటావా?.. చంద్రబాబుపై రెచ్చిపోయిన తమ్ముళ్లు
ఎన్నికల్లో వెంకటేశ్వర ప్రసాద్కు సహకరించేది లేదని తేల్చి చెప్పారు టీడీపీ నేతలు. ప్రభాకర్ చౌదరికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

టికెట్ల ప్రకటనతో రెండోరోజూ టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. అనంతపురం అర్బన్ టీడీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. అర్బన్ సీటు ప్రభాకర్ చౌదరికి కాకుండా దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్కు కేటాయించడంతో తెలుగుదేశం పార్టీలో ఒక్కసారిగా అసంతృప్తి భగ్గమంది. ప్రభాకర్ చౌదరి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యాలయంపై దాడి చేశారు.
టీడీపీ కార్యాలయంలోని ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. కార్యాలయం కిటికీలు పగులగొట్టారు. బ్యానర్లు, ఫెక్సీలు తగలబెట్టారు. పార్టీ అధినేత చంద్రబాబు ఫ్లెక్సీలను సైతం చించేశారు. రూ.30 కోట్లకు టికెట్ అమ్ముకున్నారని.. కష్టపడిన వారికి ద్రోహం చేశారని చంద్రబాబుపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు కార్యకర్తలు.
ఎన్నికల్లో వెంకటేశ్వర ప్రసాద్కు సహకరించేది లేదని తేల్చి చెప్పారు టీడీపీ నేతలు. ప్రభాకర్ చౌదరికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అటు సీటు దక్కకపోవడంతో ప్రభాకర్ చౌదరి ఫ్యామిలీ కంటతడి పెట్టుకుంది. పార్టీ కష్టకాలంలో కూడా అండగా ఉన్నామని.. కానీ ఎన్నికల్లో సీటు ఇవ్వకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.