Telugu Global
Andhra Pradesh

సీఈఓ తప్పుడు నిర్ణయం తీసుకున్నట్టు నిర్థారణ

బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న సీఈవో ఎవరికి మేలు చేకూర్చాలని ఇలాంటి నిర్ణయం తీసుకున్నారో చెప్పాలన్నారు పేర్ని నాని.

సీఈఓ తప్పుడు నిర్ణయం తీసుకున్నట్టు నిర్థారణ
X

ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనా ఇచ్చిన మెమోని వెనక్కు తీసుకున్నట్టు కోర్టుకి తెలిపిన నేపథ్యంలో.. ఆయన నిర్ణయం తప్పే కదా అని ప్రశ్నించారు మాజీ మంత్రి పేర్ని నాని. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఇష్టానుసారం ఆయన నిర్ణయాలు తీసుకున్నారని మండిపడ్డారు. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో అధికారి సీలు లేకున్నా చెల్లుబాటు అవుతాయని ఆయన జారీ చేసిన సర్కులర్ చట్ట విరుద్ధమని తేలిందని, అందుకే ఆ మెమోని వెననక్కు తీసుకున్నారని అన్నారు. కోర్టు చీవాట్లు పెట్టేలోగా వెనక్కు తగ్గడంలోనే అసలు మతలబు దాగి ఉందన్నారు నాని.

బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న సీఈవో ఎవరికి మేలు చేకూర్చాలని ఇలాంటి నిర్ణయం తీసుకున్నారో చెప్పాలన్నారు పేర్ని నాని. దేశంలో ఒకలా.. రాష్ట్రంలో మ­రోలా నిబంధన ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. చివరికి కోర్టులో లంచ్‌మోషన్‌ పిటిషన్‌ వేస్తే ఆ మెమోను వెనక్కు తీసుకున్నారని, ఆయన తప్పుడు నిర్ణయం తీసుకున్నట్లు దీనిద్వారా స్పష్టమైందని, ఎవరి కోసం ఆ తొందరపాటు నిర్ణయం తీసుకున్నారని నిలదీశారు. ఎన్నికల్లో అక్రమాలు చేసేందుకు బీజేపీతో కలిసి చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా ఫలించవని చెప్పారు పేర్ని నాని.

టీడీపీ ఎన్డీఏ­­తో కలిసి చట్టాలను చుట్టాలుగా మార్చుకుందని విమర్శించారు పేర్ని నాని. న్యాయ వ్యవస్థతో సమానంగా బాధ్యతగా మెలగాల్సిన ఎన్నికల సంఘం.. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం దురదృష్టకరం అన్నారు. ఏపీలో వైసీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తున్నా ఈసీ పట్టించుకోవడంలేదని, టీడీపీ తప్పులు ఎత్తి చూపిస్తున్నా చర్యలు లేవన్నారు. పచ్చమీడియాలో వార్తలొస్తే మాత్రం ఈసీ వెంటనే స్పందిస్తోందని, ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నించారు నాని.

First Published:  31 May 2024 1:53 AM GMT
Next Story