Telugu Global
Andhra Pradesh

పోసాని, అంబటి.. కోలుకోడానికి కాస్త టైమ్ పడుతుందా..?

మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఏపీఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసిన పోసాని కృష్ణమురళి లాంటివారు ఫలితాల తర్వాత అటు మీడియాలో కానీ, ఇటు సోషల్ మీడియాలో కానీ అందుబాటులోకి రాలేదు.

పోసాని, అంబటి.. కోలుకోడానికి కాస్త టైమ్ పడుతుందా..?
X

ఏపీలో ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత ఫలితాలకు ముందు.. వైసీపీలోని కొందరు నేతలు ఘాటు వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కారు. అలాంటి వారిలో చాలామంది ఫలితాల తర్వాత కూడా మీడియా ముందుకొచ్చారు. అయిపోయిందేదో అయిపోయిందని ముందు జరగాల్సినదాని గురించి మాట్లాడుతున్నారు. కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్ వంటి వారు నేరుగా మీడియా ముందుకొచ్చారు. రోజా నేరుగా మాట్లాడకపోయినా, సోషల్ మీడియా వేదికగా తాను అజ్ఞాతంలోకి వెళ్లలేదని నిరూపించుకున్నారు. కానీ మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఏపీఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసిన పోసాని కృష్ణమురళి లాంటివారు అటు మీడియాలో కానీ, ఇటు సోషల్ మీడియాలో కానీ అందుబాటులోకి రాలేదు. దీంతో వారందర్నీ నెటిజన్లు ఆటపట్టిస్తున్నారు. ఒక్కసారి కనపడిపోవాలని పిలుస్తున్నారు.

వేర్ ఈజ్ అంబటి..?

చీమ చిటుక్కుమన్నా ట్విట్టర్లో యాక్టివ్ గా ఉండే అంబటి రాంబాబు మే-23 తర్వాత పూర్తిగా సైలెంట్ అయ్యారు. ఫలితాలను ముందుగానే అంచనా వేసి, ఆయన సోషల్ మీడియాకు కూడా దూరమయ్యారంటూ వైరి వర్గాలు సెటైర్లు పేలుస్తున్నాయి. వైసీపీ ఓడిపోవడం, అందులోనూ పవన్ కల్యాణ్ ఈ గెలుపులో కీలకంగా మారడంతో అంబటికి ఏం మాట్లాడాలో తెలియడం లేదని, అందుకే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని కౌంటర్లిస్తున్నారు.

పోసాని కనబడుటలేదు..

ఎన్నికలకు ముందు వైసీపీ తరపున బలంగా గొంతు వినిపించిన నేతల్లో పోసాని కృష్ణమురళి ఒకరు. ఎన్నికల తర్వాత మాత్రం ఆయన అడ్రస్ లేరు. వైసీపీకి వ్యతిరేకంగా వచ్చిన ఫలితాలపై ఆయన కనీసం ఒక్క వ్యాఖ్యానం కూడా చేయలేదు. ఇప్పుడు కార్యకర్తలపై దాడులు జరుగుతున్నా కూడా కొందరు నేతలు పట్టీ పట్టనట్టు ఉన్నారనే విమర్శలు వినపడుతున్నాయి. గతంలో ఏ చిన్న విషయం జరిగినా మీడియా ముందుకొచ్చే నేతలు.. ఇప్పుడు రాష్ట్రంలో రచ్చ జరుగుతున్నా ఎందుకు సైలెంట్ గా ఉన్నారని నెటిజన్లు నిలదీస్తున్నారు. సైలెంట్ మోడ్ లో ఉన్న కొందరు నేతలు మళ్లీ ఎప్పుడు యాక్టివ్ అవుతారో వేచి చూడాలి.

First Published:  8 Jun 2024 10:17 AM GMT
Next Story