Telugu Global
Andhra Pradesh

ఆ చెడ్డపేరు నాకొద్దు -లోకేష్

ప్రతి రోజూ ప్రజల వద్ద అర్జీలు స్వీకరిస్తున్నారు లోకేష్. వివిధ సమస్యల పరిష్కారం కోసం తన వద్దకు వచ్చేవారికి ఆయన ప్రత్యేకంగా సమయం కేటాయిస్తున్నారు.

ఆ చెడ్డపేరు నాకొద్దు -లోకేష్
X

ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలపై రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో ఉపాధ్యాయ బదిలీల్లో భారీ అవినీతి జరిగిందని చెప్పారాయన. నిబంధనల ప్రకారం ఇప్పుడు ఉపాధ్యాయ బదిలీలు చేపడతామన్నారు. బదిలీల అంశంలో అంతా పారదర్శకంగా జరుగుతుందని, ఆ విషయంలో తాను చెడ్డ పేరు తెచ్చుకోదల్చుకోలేదని చెప్పారు లోకేష్. ప్రజా దర్బార్ లో కొందరు ఉపాధ్యాయ సంఘాల నేతలు ఈరోజు మంత్రి లోకేష్ ని కలిశారు. ఎన్నికల కోడ్ వల్ల బదిలీలు ఆగిపోయాయని, వాటిని కొనసాగించాలన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు.

క్యాబ్ డ్రైవర్ల వినతి..

మరోవైపు ప్రజా దర్బార్ లో మంత్రి లోకేష్ ని హైదరాబాద్ లో ఉంటున్న క్యాబ్ డ్రైవర్లు కలిశారు. వీరంతా ఏపీకి చెందినవారు. ఏపీ రిజిస్ట్రేషన్ తో హైదరాబాద్ లో వాహనాలు నడుపుకుంటున్నారు. గతంలో హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు లైఫ్ ట్యాక్స్ విషయంలో వీరికి మినహాయింపు ఉండేది. ఇప్పుడు ఉమ్మడి రాజధాని కాలపరిమితి పూర్తి కావడంతో ఏపీ వాహనాలకు తెలంగాణలో లైఫ్ ట్యాక్స్ కట్టాల్సి వస్తోంది. దీంతో తాము చాలా నష్టపోతున్నామని లోకేష్ కి వివరించారు క్యాబ్ డ్రైవర్లు. తమకు మినహాయింపు ఇచ్చేలా చూడాలన్నారు. వారి విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారు మంత్రి లోకేష్.

ప్రజా దర్బార్ కు ప్రజల తాకిడి..

మంత్రిగా తన శాఖల బాధ్యతలు చేపట్టక మునుపే నారా లోకేష్ ప్రజా దర్బార్ మొదలు పెట్టారు. ప్రతి రోజూ ఆయన ప్రజల వద్ద అర్జీలు స్వీకరిస్తున్నారు. వివిధ సమస్యల పరిష్కారం కోసం తన వద్దకు వచ్చేవారికి ఆయన ప్రత్యేకంగా సమయం కేటాయిస్తున్నారు. సామాన్య ప్రజలతోపాటు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు, ఇతర నాయకులు లోకేష్ ని కలిసిన వారిలో ఉన్నారు.

First Published:  2 July 2024 9:57 AM GMT
Next Story