Telugu Global
Andhra Pradesh

బీ కేర్ ఫుల్.. నాగబాబు స్ట్రాంగ్ వార్నింగ్

నాగబాబు ట్వీట్ ఆ వీడియో గురించేనని, ఆయన వార్నింగ్ ఆ ఛానెల్ కేనని అంటున్నారు నెటిజన్లు.

బీ కేర్ ఫుల్.. నాగబాబు స్ట్రాంగ్ వార్నింగ్
X

వైసీపీ ఇంకా పూర్తిగా చచ్చిపోలేదని, ఆ పార్టీ కోరల్లో విషం మిగిలే ఉందని ఘాటు వ్యాఖ్యలు చేశారు నాగబాబు. అందుకే కూటమిపై విష ప్రచారం కొనసాగిస్తున్నారని అన్నారు. ఇలాంటి విషప్రచారం చేసే వ్యక్తులకు ఇదే నా హెచ్చరిక అంటూ ఆయన ఓ వీడియో విడుదల చేశారు. ఇకపై కూడా ఇలాంటి ప్రచారం కొనసాగిస్తే వారిని పట్టుకుంటామని, కఠిన శిక్షలు పడేలా చేస్తామని హెచ్చరించారు. బీ కేర్ ఫుల్ అని వార్నింగ్ ఇస్తూ నాగబాబు ఈ వీడియో విడుదల చేశారు.


కూటమి స్ఫూర్తిని భంగం కలిగించే వార్తలు ఇటీవల ఎక్కువగా సోషల్ మీడియాలో వస్తున్నాయని, ఈ వార్తల్ని ప్రచారంలోకి తెస్తున్నవారంతా వైసీపీ అనుబంధ సోషల్ మీడియా విభాగాలవారేనన్నారు నాగబాబు. ఉద్దేశపూర్వకంగానే కూటమికి ఇబ్బంది కలిగించేలా ఇలాంటి వార్తల్ని సృష్టిస్తున్నారని మండిపడ్డారు. కూటమి చాలా పటిష్టంగా ఉందని, మూడు పార్టీల అధినేతలు సమష్టి నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పారు నాగబాబు. కూటమి విచ్ఛిన్నం కోసం ఇలాంటి రాతలు రాస్తున్నారని మండిపడ్డారు.

నాగబాబు వార్నింగ్ ఎవరికి..?

నాగబాబు వార్నింగ్ నిజంగా సోషల్ మీడియాకేనా, ఆ పేరుతో కొన్ని మీడియా ఛానెళ్లను ఆయన బెదిరించారా అనే విషయం తేలాల్సి ఉంది. మంత్రుల ప్రమాణ స్వీకారం రోజున ఓ మీడియా ఛానెల్ చర్చలో జనసేన నేతకు ఇలాంటి ప్రశ్నే ఎదురైంది. పెళ్లి రోజే విడాకుల గురించి మాట్లాడతారెందుకంటూ సదరు న్యూస్ రీడర్ కి జనసేన నేత గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. నా ఉద్దేశం అదికాదంటూ ఆ న్యూస్ రీడర్ నీళ్లు నమిలారు, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నాగబాబు ట్వీట్ కూడా ఆ వీడియో గురించేనని, ఆయన వార్నింగ్ ఆ ఛానెల్ కేనని అంటున్నారు నెటిజన్లు.

First Published:  14 Jun 2024 2:33 AM GMT
Next Story