Telugu Global
Andhra Pradesh

జగన్ పై నాగబాబు సంచలన వ్యాఖ్యలు

ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలంటే.. గతంలో ప్రజా వేదిక కూల్చినప్పుడే పెట్టాలని అన్నారు నాగబాబు. ఇప్పుడు రాష్ట్రపతి పాలన అంటూ జగన్ హడావిడి చేస్తున్నారని, ఆయనకు సలహాలిచ్చేవారు ఎవరని ఎద్దేవా చేశారు.

జగన్ పై నాగబాబు సంచలన వ్యాఖ్యలు
X

ఇంకా ఎంతకాలం నటిస్తారు జగన్..? అంటూ జనసేన నేత నాగబాబు సంచలన వ్యాఖ్యలతో ఓ వీడియో విడుదల చేశారు. వైసీపీ హయాంలో దళిత డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ చేస్తే అది తప్పు అని జగన్ కి అనిపించలేదా అని ప్రశ్నించారు. డాక్టర్ సుధాకర్ పై పిచ్చివాడని ముద్రవేసి, ఆయన మరణానికి కారణమైనప్పుడు, అమర్నాథ్ అనే బీసీ బిడ్డని పెట్రోల్ పోసి తగలబెట్టినప్పుడు.. జగన్ ఎందుకు బయటకు రాలేదని, ఆ ఘటనలు ఆయన దృష్టికి రాలేదా అని అడిగారు. ప్రజల ఆస్తుల్ని కాజేసేందుకు వైసీపీ నేతలు కుట్రలు పన్నారని, ఆ విషయాలు జగన్ కి తెలియవా అని ప్రశ్నించారు నాగబాబు.


వినుకొండలో రషీద్‌ హత్యపై జగన్‌ శవ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు నాగబాబు. ప్రభుత్వం ఏర్పాటై 2 నెలలు కూడా కాలేదని, అప్పుడే విమర్శలేంటని ప్రశ్నించారు. జగన్ రెండోసారి అధికారంలోకి రాకుండా ఏపీ ప్రజలు కూటమికి ఓటువేసి తమను తాము కాపాడుకున్నారని తెలిపారు. శాసనసభ సమావేశాలను ఎగ్గొట్టేందుకే జగన్‌ ఢిల్లీ వెళ్తున్నారని నాగబాబు ఆరోపించారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలెవరూ జగన్ ని ఏమీ అనరని, ఆ విధంగా తాను ఎమ్మెల్యేలందరికీ నచ్చజెబుతానని అన్నారు. జగన్ అసెంబ్లీకి రావాలని డిమాండ్ చేశారు నాగబాబు.

ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలంటే.. గతంలో ప్రజా వేదిక కూల్చినప్పుడే పెట్టాలని అన్నారు నాగబాబు. ఇప్పుడు రాష్ట్రపతి పాలన అంటూ జగన్ హడావిడి చేస్తున్నారని, ఆయనకు సలహాలిచ్చేవారు ఎవరని ఎద్దేవా చేశారు. గతంలో తాము ప్రభుత్వానికి 6 నెలలు సమయం ఇచ్చామని, అప్పటికి కూడా అరాచకాలు తగ్గకపోతే ప్రశ్నించామని గుర్తు చేశారు. వైసీపీ హయాంలో జరిగిన తప్పులన్నీ సరిదిద్దాలంటే 2 సంవత్సరాలకంటే ఎక్కువ సమయం పడుతుందన్నారు నాగబాబు. అధికారంలో ఉన్నప్పుడు, అధికారం పోయినప్పుడు కూడా జగన్ నటిస్తున్నారని చెప్పారు. వినుకొండ హత్య పూర్తిగా వ్యక్తిగత కక్షలతో జరిగిందని తెలుస్తున్నా, దానిని రాజకీయం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని గంజాయికి కేరాఫ్ అడ్రస్ గా మార్చడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని విమర్శించారు నాగబాబు.

First Published:  20 July 2024 8:48 AM GMT
Next Story