Telugu Global
Andhra Pradesh

విజయవాడకు కాదంబరి.. ముంబై హీరోయిన్ కేసులో మరో ట్విస్ట్

ఈరోజు ఆమె విజయవాడ సీపీ రాజశేఖర్ బాబుని కలుస్తారు. అనంతరం ఈ కేసు విచారణ అధికారి స్రవంతి రాయ్ తో కూడా అపాయింట్ మెంట్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.

విజయవాడకు కాదంబరి.. ముంబై హీరోయిన్ కేసులో మరో ట్విస్ట్
X

ప్రతిపక్షాన్ని టార్గెట్ చేసేలా ఉన్న ఏ చిన్న విషయాన్ని కూడా కూటమి ప్రభుత్వం అంత ఈజీగా వదిలిపెట్టడం లేదు. కాదంబరి జత్వానీ అనే ముంబై హీరోయిన్ ని వైసీపీ నేత వేధించారని, ఆమెను అడ్డు తొలగించుకునే క్రమంలో ఏపీలోని కొందరు ఐపీఎస్ లు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనేది ప్రధాన ఆరోపణ. అసలు కాదంబరి హీరోయినే కాదని, ఆమె బ్లాక్ మెయిలర్ అని సాక్షి మీడియా మరో వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలో ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఈ కేసు విచారణకు ఆదేశాలిచ్చారు. ఆయన ఆదేశాలతో విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు రంగంలోకి దిగారు. పాత ఫైళ్లను ఆయన తిరగదోడుతున్నారు. ఓ ప్రాథమి నివేదిక రూపొందించి డీజీపీకి అందజేశారు. దీంతో ఈ కేసు విచారణను సీసీఎస్‌ ఏసీపీ స్రవంతి రాయ్‌ కి అప్పగిస్తూ డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. నాలుగు రోజుల్లో స్రవంతి రాయ్‌ నివేదిక ఇస్తారని తెలుస్తోంది.

విజయవాడకు కాదంబరి..

ఇటీవల ఓ న్యూస్ ఛానెల్ డిస్కషన్ లో మాస్క్ తో కనిపించిన హీరోయిన్ కాదంబరి జత్వానీ, ఇప్పుడు నేరుగా విజయవాడకు వస్తున్నారని తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వం తనకు అండగా ఉండాలని టీవీ షో లో వేడుకున్న ఆమె.. విజయవాడకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. ఈరోజు ఆమె విజయవాడ సీపీ రాజశేఖర్ బాబుని కలుస్తారు. అనంతరం ఈ కేసు విచారణ అధికారి స్రవంతి రాయ్ తో కూడా అపాయింట్ మెంట్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఈ కేసులో ఇద్దరు ఐపీఎస్ అధికారులకు ఉచ్చు బిగుస్తున్నట్టు అనుమానాలున్నాయి.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, తరచూ ప్రతిపక్షం ఇలాంటి వార్తలతోనే టార్గెట్ అవుతోంది. ఇటీవల వరకు కొన్ని ఎపిసోడ్ లు జరిగాయి, అవి పాతబడుతున్నాయి అనుకునే టైమ్ లో ఏపీ మీడియాకి కాదంబరి జత్వానీ అంశం దొరికింది. ఈరోజు హీరోయిన్ విజయవాడ రాకతో ఈ వ్యవహారం మరింత హాట్ టాపిక్ గా మారే అవకాశముంది. ఆమె బ్లాక్ మెయిలరా, లేక ఆమెనే నిజంగా బ్లాక్ మెయిల్ చేశారా అనే అంశం తేలాల్సి ఉంది. ఐపీఎస్ అధికారుల పాత్ర ఎంత అనేది అటు పోలీస్ వర్గాల్లో కూడా చర్చనీయాంశం అవుతోంది.

First Published:  30 Aug 2024 2:31 AM GMT
Next Story