రాజధానికి రుణాలు.. ఏపీ అప్పుల పరిధిలోకి రావు
ఈ రుణాలను ఏపీ అప్పుల పరిమితిలోకి లెక్కించకూడదన్న కేంద్రం

ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని కేంద్ర ఆర్థికశాఖ తెలిపింది. అమరావతి నిర్మాణం కోసం ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) ల నుంచి తీసుకునే రుణాలు ఏపీ అప్పుల పరిమితిలోకి రావని కేంద్ర ఆర్థికశాఖ స్పష్టం చేసింది. ఈ రుణాలను ఏపీ అప్పుల పరిమితిలోకి లెక్కించకూడదని నిర్ణయించినట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు లోక్ సభలో వైసీపీ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
ఏపీ రాష్ట్ర రాజధానిగా ప్రకటించిన అమరావతి నిర్మాణానికి విదేశీ సంస్థల నుంచి తీసుకునే రుణాలు ఆ రాష్ట్ర అప్పుల పరిధిలోకి రావు. రాజధాని ప్రాంతంలో అత్యవసర మౌలిక సదుపాయాల కోసం ఇప్పటివరకు ప్రత్యేక సాయం, గ్రాంట్స్ కింద ఏపీకి రూ. 2,500 కోట్లు ఇచ్చాం. అమరావతి సమీకృత పట్టణాభివృద్ధి కార్యక్రమం, అమరావతి సమ్మిళిత, సుస్థిర రాజధాని నగర అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల నుంచి 6,700 కోట్ల చొప్పున రుణ ఆమోదం కోసం సాయం చేశాం. ప్రపంచ బ్యాంకు రుణం ఈ ఏడాది జనవరి 22 నుంచి, ఏడీబీ రుణం ఈ ఏడాది ఫిబ్రవరి 10 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ రుణాలకు సంబంధించి పంపిణీ ఇంకా జరగలేదు.
ప్రస్తుత ప్రాజెక్టు మొత్తం వ్యయం 10 శాతానికి మించకుండా గరిష్ఠంగా రూ. 1,500 కోట్లు, ప్రత్యేక గ్రాంట్ ఏపీకి 'కౌంటర్ పార్ట్ ఫండింగ్' సమకూర్చాలని కూడా నిర్ణయించాం. ఈ ప్రాజెక్టు అందిస్తున్న రుణాన్ని రాష్ట్ర రుణ పరిమితి( ఎఫ్ఆర్బీఎం)లో లెక్కించకూడదని నిర్ణయించాం. రుణాలు మంజూరు చేసేటప్పుడు రూపొందించిన మార్గదర్శకాలు, షరతులను అనుసరించి నిధుల వినియోగంపై పర్యవేక్షణ ఉంటుంది అని కేంద్ర మంత్రి లిఖితపూర్వకంగా వివరించారు.