Telugu Global
Andhra Pradesh

ఐప్యాక్ ఓ పనికిమాలిన సంస్థ.. వైసీపీనేత హాట్ కామెంట్స్

వైసీపీ ఓటమికి కారణం ఈవీఎంలేనంటూ ఓ వర్గం దుమ్మెత్తిపోస్తోంది. పోలీసులు, ఈసీ కుమ్మక్కై కూటమికి సహకరించడం వల్లే వైసీపీ ఓడిపోయిందని మరికొందరు లెక్కలేస్తున్నారు. ఇప్పుడు కొట్టు సత్యనారాయణ తెరపైకి వచ్చారు.

ఐప్యాక్ ఓ పనికిమాలిన సంస్థ.. వైసీపీనేత హాట్ కామెంట్స్
X

వైసీపీ ఓటమికి కారణం కోటరీ అంటూ ఇటీవల ఒకరిద్దరు నేతలు చేసిన ఘాటు వ్యాఖ్యలు అలజడి సృష్టిస్తున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎంగా పని చేసిన మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ ఐప్యాక్ ని టార్గెట్ చేశారు. అది ఓ పనికిమాలిన సంస్థ అని మండిపడ్డారు. అందులో ఉన్నవారంతా పనికిరాని డిగ్రీలని అడ్డు పెట్టుకుని జగన్ దగ్గరకు చేరారని అన్నారు. ఆ సంస్థను నమ్మి ఎన్నికల్లో ఓడిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు కొట్టు.

డిప్యూటీ సీఎం హోదాలో తాడేపల్లి గూడెం నుంచి పోటీ చేసిన కొట్టు సత్యనారాయణ, జనసేన అభ్యర్థి చేతిలో పరాజయం పాలయ్యారు. తనతోపాటు, పార్టీ ఓటమికి కూడా ఐప్యాక్ కారణం అంటూ ఆయన విమర్శలు చేశారు. వాళ్లను జగన్ పూర్తిగా నమ్మారని, వారిచ్చిన సమాచారంతోనే పార్టీకి నేతలు దూరమయ్యారని చెప్పారు. ఎమ్మెల్యేలపై అసంతృప్తిగా ఉన్న వారి దగ్గర నుంచి అభిప్రాయాలు సేకరించి అధిష్టానానికి వారు తప్పుడు నివేదికలు పంపారన్నారు. ప్రజాప్రతినిధులను పక్కనపెట్టి మరీ జగన్ ఐ ప్యాక్ టీమ్ ని నమ్ముకోవడం వల్లే వైసీపీ ఘోరంగా ఓడిపోయిందని హాట్ కామెంట్స్ చేశారు కొట్టు.

పెరుగుతున్న అసమ్మతి స్వరాలు..

వైసీపీ ఓటమికి కారణం ఈవీఎంలేనంటూ ఓ వర్గం దుమ్మెత్తిపోస్తోంది. పోలీసులు, ఈసీ కుమ్మక్కై కూటమికి సహకరించడం వల్లే వైసీపీ ఓడిపోయిందని మరికొందరు లెక్కలేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి.. జగన్ చుట్టూ ఉన్న కోటరీ, అధికారులపై నిందలు వేశారు. ఇప్పుడు కొట్టు సత్యనారాయణ తెరపైకి వచ్చారు. ఆయన ఐప్యాక్ ని పనికిమాలిన సంస్థ అంటూ తిట్టిపోశారు. ఇంతకీ జగన్ ఓటమికి కారణం ఎవరు..? ప్రస్తుతానికి ఎవరికి వారు వారి సొంత అభిప్రాయాల్ని మీడియా ముందు బయటపెడుతున్నారు. కారణాల అన్వేషణను పక్కనపెట్టి.. భవిష్యత్ ప్రణాళికలపై దృష్టిసారిస్తే వైసీపీకి మంచిరోజులు వస్తాయని అంటున్నారు నెటిజన్లు.

First Published:  9 Jun 2024 4:38 AM GMT
Next Story