Telugu Global
Andhra Pradesh

మాట తప్పారు.. రాళ్లతో కొట్టండి.. - జన జాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్‌ వాసు

ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్నది ఎన్‌డీఏ ప్రభుత్వమేనని, అందులో తెలుగుదేశం పార్టీ క్రియాశీలక భాగస్వామిగా ఉందని జన జాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్‌ వాసు గుర్తుచేశారు.

మాట తప్పారు.. రాళ్లతో కొట్టండి.. - జన జాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్‌ వాసు
X

తనను విశాఖపట్నం ఎంపీగా గెలిపిస్తే స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని హామీ ఇచ్చిన తెలుగుదేశం పార్టీ ఎంపీ శ్రీభరత్‌.. కేంద్రం స్టీల్‌ప్లాంట్‌ ఆస్తులను అడ్డగోలుగా అమ్మేస్తుంటే ఎందుకు నోరు మెదపడం లేదని జన జాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్‌ వాసు నిలదీశారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట తప్పిన శ్రీభరత్‌ని ఎక్కడ కనబడితే అక్కడ రాళ్లతో కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. అప్పుడు విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ ప్రక్రియ ఆగిపోతుందని ఆయన తెలిపారు. ఈ మేరకు శనివారం విశాఖపట్నంలో ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్నది ఎన్‌డీఏ ప్రభుత్వమేనని, అందులో తెలుగుదేశం పార్టీ క్రియాశీలక భాగస్వామిగా ఉందని జన జాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్‌ వాసు గుర్తుచేశారు. అయినప్పటికీ అధికారంలోకి వచ్చిన రెండు వారాల్లోనే విశాఖ ఉక్కు ఆస్తులను అమ్మేసేందుకు బీజేపీ రంగం సిద్ధం చేసిందని ఆయన తెలిపారు. రూ.475 కోట్లకు వాటిని అమ్మేసేందుకు సిద్ధమైందని పేర్కొన్నారు.

విశాఖపట్నం ఎంపీగా ఉన్న శ్రీభరత్‌ స్వయానా నారా లోకేశ్‌కి తోడల్లుడు గనుక అతన్ని రాళ్లతో కొడితే సీఎం చంద్రబాబు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరని ఆయన తెలిపారు. కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఎంపీల మద్దతుతోనే నడుస్తోందని, టీడీపీ ఎంపీల మద్దతు లేకపోతే ప్రభుత్వం కూలిపోతుందని, అలాంటప్పుడు టీడీపీ డిమాండ్‌ చేస్తే.. బీజేపీ చచ్చినట్టు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ జోలికి వెళ్లకుండా ఉంటుందని ఆయన వివరించారు.

First Published:  23 Jun 2024 5:40 AM GMT
Next Story