Telugu Global
Andhra Pradesh

ఈనెల 4న నెల్లూరుకు జగన్.. ఎందుకంటే..?

ముందుగా జగన్ నెల్లూరు జిల్లాకు రాబోతున్నారు. అక్కడినుంచే ఆయన పరామర్శలు మొదలవుతాయి.

ఈనెల 4న నెల్లూరుకు జగన్.. ఎందుకంటే..?
X

జగన్ పరామర్శ యాత్రలు మొదలవుతున్నాయి. టీడీపీ చేతిలో గాయపడిన వైసీపీ కార్యకర్తల కుటుంబాలను ఆయన పరామర్శిస్తారని ముందుగా వార్తలొచ్చినా.. ఇప్పుడు వైసీపీ నేతలతో ఆయన పరామర్శ యాత్ర మొదలు పెట్టబోతున్నారని తెలుస్తోంది. ముందుగా జగన్ నెల్లూరు జిల్లాకు రాబోతున్నారు. అక్కడినుంచే ఆయన పరామర్శలు మొదలవుతాయి.


ఈనెల 4న నెల్లూరుకు..

జైలులో ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించేందుకు ఈనెల 4న జగన్ నెల్లూరుకు వస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. జగన్ నెల్లూరు జిల్లా పర్యటనకు సంబంధించి మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి షెడ్యూల్ విడుదల చేశారు. ఈనెల 4న ఉదయం 9.40 గంటలకు హెలికాప్టర్ లో నెల్లూరుకు వస్తారు జగన్. అక్కడినుంచి రోడ్డు మార్గం ద్వారా చెముడుగుంటలో ఉన్న జిల్లా సెంట్రల్ జైలుకి వెళ్తారు. అక్కడ రిమాండ్ ఖైదీగా ఉన్న పిన్నెల్లిని పరామర్శిస్తారు.

పోలింగ్ రోజు ఈవీఎంని ధ్వంసం చేసిన కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు రిమాండ్ విధించడంతో ఆయన్ను నెల్లూరు జిల్లా సెంట్రల్ జైలుకి తరలించారు. ఆయన్ను పరామర్శించేందుకు జగన్ ఇప్పుడు నెల్లూరుకు వస్తున్నారు. స్థానిక నేతలు జగన్ పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేయగా, ఈసారి ఎన్నికల్లో మాత్రం జిల్లాలో ఒక్క సీటు కూడా వైసీపీకి రాలేదు. అయితే జిల్లా నేతలు మాత్రం పార్టీని పటిష్టపరిచేందుకు ఇప్పటినుంచే ప్రయత్నాలు ప్రారంభించారు.

First Published:  2 July 2024 1:37 PM GMT
Next Story