రుషికొండ కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు
రుషికొండను అక్రమంగా తవ్వేస్తున్నారంటూ దాఖలైన పిటిషన్లు విచారించిన హైకోర్టు .. అసలెంత మేర తవ్వకాలు జరిగాయో సర్వేచేసి నివేదిక ఇవ్వాల్సిందిగా కేంద్ర అటవీ, పర్యావరణశాఖను ఆదేశించింది.

విశాఖ రుషికొండ తవ్వకాలపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. రుషికొండను అక్రమంగా తవ్వేస్తున్నారంటూ దాఖలైన పిటిషన్లు విచారించిన హైకోర్టు .. అసలెంత మేర తవ్వకాలు జరిగాయో సర్వేచేసి నివేదిక ఇవ్వాల్సిందిగా కేంద్ర అటవీ, పర్యావరణశాఖను ఆదేశించింది. వాదనల సందర్భంగా అనుమతుల కంటే మూడు ఎకరాల మేర అధికంగా తవ్వకాలు జరిగినట్టు ప్రభుత్వం అంగీకరించింది. అయితే పిటిషనర్ మాత్రం మూడు ఎకరాలు కాదు అంతకు మించి అదనంగా తవ్వకాలు జరిపారని ఆరోపించారు.
9.88 ఎకరాల్లో మాత్రమే తవ్వకాలకు అనుమతి ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం 20 ఎకరాలకు పైగా కొండను తవ్వేశారని వివరించారు. తవ్వేసిన మట్టిన పక్కనే సముద్రంలో వేశారని కోర్టుకు వివరించారు. దాంతో సర్వేకు కోర్టు ఆదేశించింది. ఎంత విస్తీర్ణంతో అధికంగా తవ్వకాలు జరిగాయో నివేదిక ఇవ్వాలని..ఆ నివేదిక ఆధారంగా తదుపరి ఏం చర్యలు తీసుకోవాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 14కు వాయిదా వేస్తూ ఆ లోపే సర్వే చేసి నివేదిక ఇవ్వాలని కేంద్ర అటవీ పర్యావరణ శాఖ అధికారులను కోర్టు ఆదేశించింది.