Telugu Global
Andhra Pradesh

వైసీపీలో లుకలుకలు.. జగన్ ని తప్పుదోవ పట్టించారన్న మాజీ ఎమ్మెల్యే

జగన్ మంచి పనులు చేసినా, ఆయన చుట్టూ ఉన్న కోటరీ తప్పుదోవ పట్టించిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు జక్కంపూడి రాజా.

వైసీపీలో లుకలుకలు.. జగన్ ని తప్పుదోవ పట్టించారన్న మాజీ ఎమ్మెల్యే
X

జగన్ ఓడినా గెలిచినా రియల్ హీరో అని అన్నారు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. అయితే నమ్ముకున్నవారే ఆయన్ను ముంచేశారని మండిపడ్డారు. జగన్ చుట్టూ ఉన్న కోటరీ, కొంతమంది పనికిమాలిన అధికారులు.. వ్యవస్థని భ్రష్టు పట్టించారన్నారు. జగన్ ని వారంతా తప్పుదోవ పట్టించారని చెప్పారు. అయితే జక్కంపూడి రాజా చెబుతున్న ఆ కోటరీ ఎవరనేది ఇప్పుడు సంచలనంగా మారింది. సొంత పార్టీలోని కొందరు నేతల్ని పరోక్షంగా రాజా టార్గెట్ చేశారు. కోటరీ అంటూ పేరెత్తకుండా వారిపై డైరెక్ట్ అటాక్ చేశారు.

ఎన్నికల ఫలితాలు తీవ్ర నిరాశకు గురి చేయడంతో వైసీపీలో లుకలుకలు మొదలయ్యాయి. ఓటమి కారణాలు విశ్లేషించుకుంటాం, తిరిగి తమ ప్రయాణం మొదలు పెడతామని కొంతమంది నేతలు చెబుతున్నారు. మరికొందరు మాత్రం కాస్త ఘాటుగానే తమ స్పందన తెలియజేస్తున్నారు. అందులో జక్కంపూడి రాజా ఒకరు. జగన్ మంచి పనులు చేసినా, ఆయన చుట్టూ ఉన్న కోటరీ తప్పుదోవ పట్టించిందని ఘాటు వ్యాఖ్యలు చేశారాయన. మంచి చేస్తేనే ఓటు వేయండి అని చెప్పే దమ్మున్న నాయకుడు జగన్ అని, అలాంటి నాయకుడికి కేవలం 11 సీట్లు రావడం దారుణం అని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఏ ముఖ్యమంత్రికీ జగన్ లాంటి కమిట్ మెంట్ ఉండదన్నారు రాజా.

ప్రతి రోజూ ప్రజలకోసం పనిచేసినా, శక్తికి మించి మంచి పనులు చేసినా కూడా తమకి ఓటమి తప్పలేదన్నారు జక్కంపూడి రాజా. తాము తప్పు చేశామా, ప్రజలే తప్పుచేశారా అనేది విశ్లేషించుకోవాల్సిన సందర్భం వచ్చిందన్నారాయన. మొత్తమ్మీద ఓటమి తర్వాత ప్రెస్ మీట్లు పెడుతున్న వైసీపీ నేతల్లో కొందరు సొంత పార్టీ నేతల్నే టార్గెట్ చేయడం విశేషం. జగన్ మంచివారే కానీ, ఆయన చుట్టూ ఉన్నవారి తప్పుల వల్లే పార్టీ నష్టపోయిందని అంటున్నారు వారంతా. ఈ వ్యాఖ్యలపై పార్టీ పెద్దలు స్పందిస్తారేమో చూడాలి.

First Published:  5 Jun 2024 10:30 AM GMT
Next Story