Telugu Global
Andhra Pradesh

కక్ష లేదంటూనే కక్ష సాధింపులు..

ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, సీనియర్ ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామిరెడ్డిని చంద్రబాబు నివాసంలోకి అనుమతించలేదు. దీంతో వారిద్దరూ బయట్నుంచి బయటే వెనుదిరిగారు.

కక్ష లేదంటూనే కక్ష సాధింపులు..
X

కక్ష సాధింపు రాజకీయాలు మేం చేయడంలేదంటూ టీడీపీ నేతలు గొప్పగా చెప్పుకుంటున్నారు. మేం అధికారంలోకి వచ్చాక కక్షసాధింపులుండవని హామీ ఇస్తున్నారు. కానీ అధికారంలోకి రాకముందే టీడీపీ అనుకున్నవన్నీ చేస్తుందనే అనుమానాలు బలపడుతున్నాయి. ముఖ్యంగా డిప్యుటేషన్ పై వచ్చిన అధికారుల్ని వారి మాతృ సంస్థలకు పంపించకుండా ఆపేశారు. కనీసం వారికి సెలవలు కూడా మంజూరు చేయడంలేదు. ఇక ఇద్దరు ఐపీఎస్ అధికారులకు చంద్రబాబు సెక్యూరిటీ చుక్కలు చూపించారు. కాబోయే ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు చెబుదామని వస్తే ఇంటి బయటే ఆపేశారు. దీంతో చేసేదేం లేక వారు అటునుంచి అటే వెనుదిరిగారు.

ఉండవల్లిలో చంద్రబాబు నివాసం వద్ద ఆయన్ను కలిసేందుకు వచ్చిన ఇద్దరు ఐపీఎస్ అధికారులను సెక్యూరిటీ సిబ్బంది ఆపేశారు. ఆయన్ను కలిసేందుకు అనుమతి లేదని చెప్పేశారు. ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, సీనియర్ ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామిరెడ్డిని చంద్రబాబు నివాసంలోకి అనుమతించలేదు. దీంతో వారిద్దరూ బయట్నుంచి బయటే వెనుదిరిగారు.

ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న పీఎస్ఆర్ ఆంజనేయుల్ని ఎన్నికల ముందు టీడీపీ బ్యాచ్ ఆరోపణలతో ఈసీ పక్కకు తప్పించింది. తాజాగా ఆయన చంద్రబాబుని కలిసేందుకు ఉండవల్లి నివాసానికి రాగా.. మెయిన్ గేట్ వద్ద కానిస్టేబుళ్లు ఆయన కారుని ఆపివేశారు. లోపలికి అనుమతి లేదన్నారు. ఇక మరో ఐపీఎస్ ఆఫీసర్ కొల్లి రఘురామిరెడ్డిది మరో కథ. నంద్యాలలో చంద్రబాబు అరెస్ట్ సమయంలో రఘురామిరెడ్డి కీలకంగా వ్యవహరించారు. దీంతో ఆయనపై కూడా టీడీపీ గుర్రుగా ఉంది. చంద్రబాబుని కలిసేందుకు ఆయన అనుమతి కోరగా అక్కడి అధికారులు నిరాకరించారు. వైసీపీకి అనుకూలం అనుకుంటున్న అధికారుల్ని కనీసం కలిసేందుకు కూడా చంద్రబాబు ఇష్టపడటంలేదని తెలుస్తోంది.

First Published:  6 Jun 2024 6:51 AM GMT
Next Story