Telugu Global
Andhra Pradesh

ఏపీలో వాలంటీర్లకు చంద్రబాబు షాక్

సచివాలయ సిబ్బంది ఇంటింటికి తిరిగి పెన్షన్ పంపిణీ చేయనున్నారు. ఈ నిర్ణయంతో వాలంటీర్ వ్యవస్థను తీసేస్తారనే ఆందోళన మొదలైంది. అంతేకాదు వాలంటీర్లకు ఇచ్చే పేపర్ అలవెన్స్‌ రూ.200 సైతం రద్దు చేశారు.

ఏపీలో వాలంటీర్లకు చంద్రబాబు షాక్
X

ఏపీలో జగన్‌ ప్రభుత్వం వాలంటీర్‌ వ్యవస్థను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకాన్ని లబ్ధిదారులకు చేరవేసేవారు వాలంటీర్లు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2.5 లక్షల మందికిపైగా వాలంటీర్లు ఉన్నారు. వీరి ద్వారానే వృద్ధులకు పెన్షన్, రేషన్‌ ఇంటి దగ్గరే అందేవి. కాగా, ఇటీవలి ఎన్నికల్లో వాలంటీర్‌ వ్యవస్థను కొనసాగిస్తామని, వారికిచ్చే ప్రోత్సాహకాన్ని రూ.10 వేలకు పెంచుతామని టీడీపీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

తొలి కేబినెట్‌ సమావేశంలోనే వాలంటీర్లకు షాకిచ్చారు చంద్రబాబు. అసలు వాలంటీర్ వ్యవస్థకే ఎసరు పెట్టారు. ఇకపై పెన్షన్‌ పంపిణీ నుంచి వాలంటీర్లను పక్కనపెట్టేయాలని నిర్ణయించారు. వృద్ధులకు, వికలాంగులకు సచివాలయ సిబ్బందితోనే పెన్షన్ పంపిణీ చేయించాలని నిర్ణయించారు. సచివాలయ సిబ్బంది ఇంటింటికి తిరిగి పెన్షన్ పంపిణీ చేయనున్నారు. ఈ నిర్ణయంతో వాలంటీర్ వ్యవస్థను తీసేస్తారనే ఆందోళన మొదలైంది. అంతేకాదు వాలంటీర్లకు ఇచ్చే పేపర్ అలవెన్స్‌ రూ.200 సైతం రద్దు చేశారు. ఇక ఇటీవల డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ సైతం అసలు పంచాయతీ వ్యవస్థ ఉండగా.. వాలంటీర్‌, సచివాలయ వ్యవస్థ ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందని అధికారులను ప్రశ్నించిన విషయం తెలిసిందే.


ఇక వాలంటీర్లను పెన్షన్‌ పంపిణీ నుంచి తొలగించాలన్న చంద్రబాబు సర్కార్‌ నిర్ణయంపై స్పందించింది వైసీపీ. చంద్రబాబు గెలిచిన మూడు వారాల్లోనే తన కపటబుద్ధిని బయటపెట్టాడంటూ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఓట్ల కోసమే జీతం పెంచి వాలంటీర్లను కొనసాగిస్తానని చంద్రబాబు అబద్ధపు హామీలిచ్చాడని ట్వీట్ చేసింది వైసీపీ. వాలంటీర్ వ్యవస్థ రద్దు దిశగా అడుగులుపడుతున్నాయని చెప్పుకొచ్చింది. గతంలో వాలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

First Published:  25 Jun 2024 2:33 AM GMT
Next Story