Telugu Global
Andhra Pradesh

గుదిబండలా బీజేపీ.. బాబు వ్యూహాత్మక తప్పిదం

టీడీపీకి ఒరిగేదేంటి..? బీజేపీ వల్ల మేలు జరగకపోగా ముస్లిం ఓట్లు దూరమవుతున్నాయి.

గుదిబండలా బీజేపీ.. బాబు వ్యూహాత్మక తప్పిదం
X

ఎన్డీఏని నమ్ముకొని ఈసారి నిండా మునిగారు చంద్రబాబు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని అనుకోవడం, జనసేనతో దోస్తీ కావాలనుకుంటే బీజేపీని కూడా భరించాల్సి రావడం వల్ల ఆయన కూటమిలో చేరారు. తీరా ఇప్పుడు అదే బీజేపీ.. కూటమి ఓటమిని శాసిస్తోంది. ఏపీలోని కొన్ని నియోజకవర్గాల్లో నిర్ణయాత్మకంగా ఉన్న ముస్లిం ఓట్లు బీజేపీ వల్ల కూటమికి దూరం అవుతున్నాయి.

బాబు గారడీలు..

తాజాగా రాయచోటి ప్రచార సభలో చంద్రబాబు ముస్లింలపై వరాల జల్లు కురిపించారంటూ నారా లోకేష్ ఓ వీడియోని పోస్ట్ చేశారు. అసలాయన కురిపించిన జల్లు ఏంటా అని ఆ వీడియో వింటే.. అందులో జగన్ ని తిట్టడం మినహా ఇంకేం లేదు. ఇక 4 శాతం ముస్లిం రిజర్వేషన్ల గురించి కూడా చంద్రబాబు కక్కలేక, మింగలేక అన్నట్టుగా మాట్లాడారు. ప్రస్తుతం ఆ కేసు సుప్రీంకోర్టులో ఉందని, మంచి మంచి లాయర్లను పెట్టి ముస్లింలకు అనుకూలంగా తీర్పు వచ్చేట్టు చేస్తానని హామీ ఇచ్చారు చంద్రబాబు. ఈ హామీ అమిత్ షా వ్యాఖ్యలకు పూర్తి వ్యతిరేకంగా ఉంది. ఎన్డీఏకి మెజార్టీ ఇస్తే ముస్లిం రిజర్వేషన్లు తీసేసి వాటిని ఎస్సీ, ఎస్టీలకు ఇస్తామంటూ అమిత్ షా ఇటీవల గొంతు చించుకుంటున్నారు. ఇక్కడ చంద్రబాబు మాత్రం రిజర్వేషన్లు తొలగించబోమంటూ హామీ ఇస్తున్నారు.


ఎన్డీఏ కూటమిలో చేరి చంద్రబాబు నిండా మునిగారనే విషయం అర్థమవుతోంది. బీజేపీ ముస్లిం వ్యతిరేక విధానాలతో ఏపీలో టీడీపీ, జనసేన సతమతం అవుతున్నాయి. ఏపీలో బీజేపీ ఒంటరిగా పోటీ చేసినా ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాదు. కూటమిలో చేరడంతో టీడీపీ, జనసేన ఓట్లు కాషాయదళానికి ట్రాన్స్ ఫర్ కావాల్సిన పరిస్థితి. కానీ టీడీపీకి ఒరిగేదేంటి..? బీజేపీ వల్ల మేలు జరగకపోగా ముస్లిం ఓట్లు దూరమవుతున్నాయి. తాజాగా జీహాదీ ఓటు బ్యాంక్ అంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు ముస్లిం వర్గంలో తీవ్ర ఆందోళనకు కారణం అవుతున్నాయి. అదే సమయంలో మోదీ విమర్శలపాలవుతున్నారు. ఇక్కడ చంద్రబాబు మాత్రం కవరింగ్ గేమ్ ఆడలేక సతమతం అవుతున్నారు.



First Published:  3 May 2024 10:35 AM GMT
Next Story