Telugu Global
Andhra Pradesh

గుట్టుచప్పుడు కాకుండా విదేశాలకు బాబు, లోకేష్..

ఎన్నికల తర్వాత చంద్రబాబు పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్తే ఎల్లో మీడియా ఎక్కడలేని ప్రచారం ఇచ్చింది. విదేశాలకు వెళ్తుంటే మాత్రం ఏమీ ఎరగనట్టు సైలెంట్ గా ఉంది.

గుట్టుచప్పుడు కాకుండా విదేశాలకు బాబు, లోకేష్..
X

సీఎం జగన్ లండన్ పర్యటన గురించి ఎల్లో మీడియా ఎంత వెటకారం చేసిందో అందరికీ తెలుసు. ఎన్నికల ఫలితాలను ముందే ఊహించి జగన్ విదేశాలకు పారిపోయారంటూ టీడీపీ అనుకూల సోషల్ మీడియా కూడా రచ్చ చేసింది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు చంద్రబాబు, లోకేష్ కూడా అమెరికా వెళ్లారు. కానీ ఈ వార్త ఎల్లో మీడియాలో రాలేదు, కనీసం సోషల్ మీడియాలో కూడా వైరల్ కాలేదు. ఎందుకు..?

గుట్టు చప్పుడు కాకుండా..

జగన్ విదేశీ పర్యటన గురించి వైసీపీ అధికారికంగా ప్రకటించింది, ఆయన అక్కడ ఎన్నిరోజులు ఉంటారు, ఎప్పుడు తిరిగొస్తారనే విషయాలను కూడా తెలిపారు. కానీ చంద్రబాబు పర్యటనపై మాత్రం ఎలాంటి వివరాలు బయటకు రాలేదు. ఆ మాటకొస్తే రహస్యంగా వారిద్దరూ విడివిడిగా దేశం దాటేశారని తెలుస్తోంది. నాలుగు రోజుల క్రితమే గుట్టుగా లోకేష్ అమెరికాకు చెక్కేశారు. చంద్రబాబుని శంషాబాద్ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకోవడంతో అసలు విషయం బయటపడింది. బాబు అమెరికా పర్యటన వ్యవహారం గుట్టు రట్టయింది.

స్కిల్‌ స్కామ్‌ కేసులో నిందితులైన చంద్రబాబు, ఆయన మాజీ పీఎస్‌ పెండ్యాల శ్రీనివాస్, కిలారు రాజేష్‌పై సీఐడీ గతంలో లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేసింది. సీఐడీ అదనపు డీజీ అనుమతి లేనిదే వారు విదేశాలకు వెళ్లకూడదు. అనుమతి తీసుకోకుండానే చంద్రబాబు అమెరికా వెళ్లాలనుకున్నారు. మరోవైపు ఫైబర్‌ నెట్‌ కేసులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ విచారణలో ఉండగా చంద్రబాబు కోర్టుకి సమాచారం ఇవ్వకుండా విదేశాలకు వెళ్లాలనుకోవడం విశేషం. దీంతో ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కాసేపు చర్చ జరిగింది. సీఐడీ అధికారుల వివరణ తీసుకున్నారు. ప్రస్తుతానికి అమెరికా వెళ్లేందుకు అనుమతి లభించింది. దీంతో చంద్రబాబు తన సతీమణి భువనేశ్వరితో కలసి దుబాయి మీదుగా అమెరికా వెళ్లారు.

అమెరికా ట్రీట్మెంట్..

చంద్రబాబు గతంలో కూడా వైద్యం కోసం అమెరికా వెళ్లారు. ఇప్పుడు కూడా ఆయన ట్రీట్మెంట్ కోసమే అక్కడికి వెళ్లారని తెలుస్తోంది. లోకేష్ మాత్రం విహార యాత్రకు వెళ్లారని అంటున్నారు. ఎన్నికల తర్వాత చంద్రబాబు పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్తే ఎల్లో మీడియా ఎక్కడలేని ప్రచారం ఇచ్చింది. విదేశాలకు వెళ్తుంటే మాత్రం ఏమీ ఎరగనట్టు సైలెంట్ గా ఉంది.

First Published:  20 May 2024 2:50 AM GMT
Next Story