Telugu Global
Andhra Pradesh

నేను సౌమ్యుడిని కావొచ్చు.. కానీ నా గుండె గట్టిది

తాత్కాలికంగా కష్టాలు వచ్చినా.. దేవుడు ఎప్పుడూ మేలు చేస్తారని, ఇది తాను నమ్మిన సిద్ధాంతం అని అన్నారు అవినాష్ రెడ్డి.

నేను సౌమ్యుడిని కావొచ్చు.. కానీ నా గుండె గట్టిది
X

"నేను సౌమ్యుడిని కావచ్చు, నా మాట మెత్తగా రావచ్చు, కానీ నా గుండె గట్టిది.. ఎన్నింటినైనా ఎదుర్కొనే ధైర్యం నాకుంది. ఏం జరిగినా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నిలబడతా." అని అన్నారు కడప ఎంపీ వైఎస్‌ అవినాష్ రెడ్డి. తన అక్కలు ఇద్దరూ చంద్రబాబు ట్రాప్ లో పడిపోయారని ఆరోపించారు. ఆయన డైరక్షన్ లోనే వాళ్లు మాట్లాడుతున్నారని, ఆయన చెప్పినట్టల్లా వారు నడచుకుంటున్నారని చెప్పారు అవినాష్ రెడ్డి.

తనకు తెలిసి జీవితంలో ఎవరికీ ఏ పాపం చేయలేదని, కానీ తనకు మాత్రం ఎందుకిలా అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు అవినాష్ రెడ్డి. పులివెందుల నియోజకవర్గంలోని లింగాలలో రోడ్ షో నిర్వహించిన ఆయన.. తనని అనవసరంగా వివేకా హత్యకేసులో ఇరికించారని చెప్పారు. తనతోపాటు తన తండ్రిని కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. దేవుని దయతో, ప్రజల దీవెనలతో తనకు బెయిల్ వచ్చిందన్నారు అవినాష్ రెడ్డి.

తాత్కాలికంగా కష్టాలు వచ్చినా.. దేవుడు ఎప్పుడూ మేలు చేస్తారని, ఇది తాను నమ్మిన సిద్ధాంతం అని అన్నారు అవినాష్ రెడ్డి. తన అన్న తనను నమ్మారని, ఆయన ఆశీస్సులతో, ప్రజల ఆశీస్సులతో తిరిగి గెలుస్తానని చెప్పారు. వివేకా హత్య కేసు విషయంలో షర్మిల, సునీత చేసిన తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నా అవినాష్ రెడ్డి మాత్రం సంయమనం పాటిస్తూనే వచ్చారు. వారికి అదే రీతిలో ఆయన బదులు చెప్పలేదు. వారిద్దరూ చంద్రబాబు ట్రాప్ లో పడిపోయారని, ఆ మాయనుంచి బయటపడి అసలు నిజాలు తెలుసుకోవాలని మాత్రం చెబుతున్నారు అవినాష్ రెడ్డి.

First Published:  8 May 2024 7:08 AM GMT
Next Story