Telugu Global
Andhra Pradesh

కక్షసాధింపులు కంటిన్యూ.. రంగంలోకి జేసీబీలు

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ నేతల ఆస్తుల్ని లక్ష్యంగా చేసుకుని టీడీపీ జేసీబీలను రంగంలోకి దించింది.

కక్షసాధింపులు కంటిన్యూ.. రంగంలోకి జేసీబీలు
X

ఏపీలో రాజకీయ కక్షసాధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఓవైపు వైసీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయి, మరోవైపు నాయకుల పర్యటనలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంకోవైపు ఉత్తరాది ఫార్ములా కూడా ఇక్కడ అప్లై చేస్తున్నారు టీడీపీ నేతలు. జేసీబీలను రంగంలోకి దించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని వైసీపీ ఆరోపిస్తోంది.

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ నేతల ఆస్తుల్ని లక్ష్యంగా చేసుకుని టీడీపీ జేసీబీలను రంగంలోకి దించింది. ఎమ్మెల్యే బోండా ఉమా.. పైకి శాంతిమంత్రం పఠిస్తున్నా తెరవెనక రాజకీయాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు. వీఎంసీ అధికారులను ఉసిగొల్పి వైసీపీ నేతల ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నారంటూ ఓ వీడియో విడుదల చేశారు. ప్రకాష్ నగర్ లో వైసీపీ నేత నందెపు జగదీష్ బిల్డింగ్ కూల్చివేశారని అంటున్నారు.


రాత్రి నోటీసులు, తెల్లారి కూల్చివేత..

కార్పొరేషన్ స్థలం ఆక్రమించారంటూ రాత్రి నందెపు జగదీష్ కి అధికారులు నోటీసులు ఇచ్చారు. నోటీసుకు సమాధానం ఇచ్చేందుకు కూడా అవకాశం ఇవ్వని అధికారులు, ఉదయాన్నే జేసీబీలతో వచ్చి భవనంలో కొంత భాగం కూల్చివేశారు. ఇది అన్యాయం అంటూ వైసీపీ అంటోంది. అయితే టీడీపీ మాత్రం ఈ వ్యవహారంతో తమకు సంబంధం లేదని చెబుతోంది. చట్టం తన పని తాను చేసుకుపోతోందని అంటున్నారు టీడీపీ నేతలు.

First Published:  15 Jun 2024 3:08 PM GMT
Next Story