నారాయణ అల్లుడి క్వాష్ పిటిషన్ కొట్టివేత
సీఐడీ నోటీసులను సస్పెండ్ చేయాలని తన పిటిషన్లో కోరారు. అయితే.. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఆయన పిటిషన్ను కొట్టివేసింది.

మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్కు సీఐడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు. సీఐడీ నోటీసులను సస్పెండ్ చేయాలని తన పిటిషన్లో కోరారు. అయితే.. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఆయన పిటిషన్ను కొట్టివేసింది. ఆయన తన న్యాయవాదితో కలిసి బుధవారం జరిగే సీఐడీ విచారణకు హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించింది.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నిందితులుగా ఉన్న చంద్రబాబు, నారాయణ, లోకేష్ తదితరులు.. అసలు ఇన్నర్ రింగ్ రోడ్డే లేదు.. మాకేం తెలియదంటూ బుకాయిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో అక్రమాలు తవ్విన కొద్దీ మరిన్ని బయటపడుతున్నాయి. హెరిటేజ్ ఫుడ్స్, లింగమనేని కుటుంబం, తమ బినామీల భూములను ఆనుకుని ఇన్నర్ రింగ్ రోడ్డును నిర్మించేలా అలైన్మెంట్లో మూడు సార్లు మార్పులు చేసి మరీ ఖరారు చేశారు. సీఐడీ విచారణలో అవన్నీ వెల్లడి కావడంతో ఈ కేసులో కొత్త పేర్లు బయటికి వస్తున్నాయి. అందులో భాగంగానే నారాయణ అల్లుడు పునీత్కి కూడా సీఐడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.