Telugu Global
Andhra Pradesh

పోలవరంపై అమిత్ షా జబర్దస్త్ కామెడీ

అమరావతిపై కూడా అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి రాజధానిని పునర్ నిర్మించడానికి బీజేపీ-టీడీపీ-జనసేన కూటమిని గెలిపించాలన్నారు.

పోలవరంపై అమిత్ షా జబర్దస్త్ కామెడీ
X

ఏపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా కామెడీ మొదలు పెట్టారు. ఎన్డీఏ కూటమి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే పోలవరం పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. పదేళ్లుగా అధికారంలో ఉన్న ఎన్డీఏ పోలవరాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఇప్పుడు ఎన్నికల వేళ మళ్లీ కాకమ్మ కథలు మొదలు పెట్టింది.


రాష్ట్ర విభజనకు ముందే పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించి కీలక పనులు పూర్తయ్యాయి. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే కాల్వల నిర్మాణం దాదాపుగా ఓ కొలిక్కి వచ్చింది. విభజన తర్వాత పోలవరాన్ని ఏటీఎంలా మార్చుకున్నారు చంద్రబాబు. కేంద్రం నిర్మించాల్సిన ప్రాజెక్ట్ ని రాష్ట్రం చేతుల్లోకి తీసుకుని నిధులు భోంచేశారు. పోనీ నిర్మాణం అయినా చక్కగా చేశారా అంటే అదీ లేదు. ఆ తప్పులు సరిచేయడానికే వైసీపీకి టైమ్ సరిపోయింది. తీరా ఇప్పుడు అమిత్ షా వచ్చి కూటమి తరపున పోలవరంపై హామీ ఇస్తే అది కామెడీ కాక ఇంకేంటి..?

ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. తాము ప్రజలకు తాగునీరు, సాగునీరు అందించాలని చూస్తుంటే ఏపీలోని వైసీపీ ప్రభుత్వం ఆ ప్రాజెక్ట్ ని అడ్డు పెట్టుకుని దోచుకుంటోందన్నారు. గతంలో మోదీ కూడా ఇలాగే చంద్రబాబుని విమర్శించారు. ఇప్పుడు అదే చంద్రబాబు ఎన్డీఏ కూటమిలో చేరే సరికి పునీతులయ్యారు. ప్రత్యర్థిగా ఉన్న జగన్ పై అమిత్ షా నిందలు వేస్తున్నారు.

అమరావతిపై కూడా అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి రాజధానిని పునర్ నిర్మించడానికి బీజేపీ-టీడీపీ-జనసేన కూటమిని గెలిపించాలన్నారు. గతంలో అమరావతి శంకుస్థాపనకు వచ్చిన మోదీ పిడికెడు మట్టి ఇచ్చి వెళ్లారు, ఆర్థిక సాయం గురించి మాత్రం నోరు మెదపలేదు. ఇప్పుడు కొత్తగా అమిత్ షా వచ్చి అమరావతికి నిధులిస్తామంటే నమ్మేదెలా...? మొత్తమ్మీద ఏపీకి వచ్చిన అమిత్ షా అమరావతి, పోలవరం పేరు చెప్పి సీరియస్ గా నవ్వులుపూయించారు.

First Published:  5 May 2024 9:31 AM GMT
Next Story