Telugu Global
Andhra Pradesh

టీడీపీ గుప్పెట్లో 'కంట్రోల్' రూమ్..?

పోలీస్ 'కంట్రోల్' రూమ్ పై చంద్రబాబు మనిషి పెత్తనం ఏంటని నిలదీస్తున్నారు వైసీపీ నేతలు.

టీడీపీ గుప్పెట్లో కంట్రోల్ రూమ్..?
X

ఆయన పేరు ఏఆర్ దామోదర్.

2007 గ్రూప్-1 బ్యాచ్‌కు చెందిన అధికారి.

ఓట్ల లెక్కింపు సందర్భంగా ఆయనకు ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో 'కంట్రోల్' రూమ్ బాధ్యతలు అప్పగించారు. ఇంతవరకు అంతా బాగానే ఉంది కానీ, ఆయనే ఎందుకు..? అనే ప్రశ్న వచ్చినప్పుడే అసలు విషయం బయటపడుతోందని అంటున్నారు వైసీపీ నేతలు.

ఓట్ల లెక్కింపు సందర్భంగా ఏఆర్ దామోదర్ ని ఏరికోరి పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని కంట్రోల్ రూమ్ కి ఇన్ చార్జ్ గా వేసినట్టు తెలుస్తోంది. చంద్రబాబు ఒత్తిడితోనే ఎన్నికల కమిషన్, రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. టీడీపీకి వీర విధేయుడిగా పేరున్న దామోదర్ ని ఇప్పటికిప్పుడు ఆ స్థానంలో నియమించడమేంటని ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు.

ఎన్నికల వేళ ఏ పోలీస్ అధికారికి, ఏ బాధ్యత అయినా అప్పగించే అవకాశం ఉంది. కానీ దామోదర్ విషయం వేరు. ఒంగోలులో పోలీస్ ట్రైనింగ్ కాలేజీ (పీటీసీ) ఎస్పీగా ఉన్న దామోదర్ ని పంజాబ్ ఎన్నికల పరిశీలకుడిగా నియమించారు. అక్కడ పోలింగ్ ముగిసిన తర్వాత ఆయన వ్యక్తిగత సెలవు తీసుకున్నారు. అలా సెలవులో ఉన్న దామోదర్ ని ఏరికోరి కౌంటింగ్ సమయానికి 'కంట్రోల్' రూమ్ కి తీసుకొచ్చారు. కౌంటింగ్ రోజు ఎక్కడ ఏ అల్లర్లు జరిగినా అవి 'కంట్రోల్' రూమ్ కి తెలుస్తాయి. అక్కడి ఫుటేజీపై ఇన్ చార్జ్ కే అధికారం ఉంటుంది. అలా దామోదర్ ని అడ్డు పెట్టుకుని చంద్రబాబు మరో కుట్రకు తెరలేపారనే విమర్శలు వినపడుతున్నాయి. పోలీస్ 'కంట్రోల్' రూమ్ పై చంద్రబాబు మనిషి పెత్తనం ఏంటని నిలదీస్తున్నారు వైసీపీ నేతలు. పంజాబ్ ఎన్నికల పరిశీలకుడిగా ఉన్న ఆయన్ను.. కౌంటింగ్ రోజు నాటికి ఏపీకి తీసుకొచ్చి కీలక బాధ్యతలు అప్పజెప్పే విధంగా చంద్రబాబు చక్రం తిప్పారని, వ్యవస్థలను మేనేజ్ చేశారని అంటున్నారు. దీని పర్యవసానం ఎలా ఉంటుందోననే అనుమానాలున్నాయి.

First Published:  4 Jun 2024 12:25 AM GMT
Next Story