Telugu Global
National

ఓటుకు నోటు అధికారికం.. ఆమ్ ఆద్మీ రేటు రూ.10లక్షలు..

ఇతర పార్టీల వద్ద ఓటుకి 2 వేల రూపాయలు తీసుకుంటారా? లేక ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపించి.. దర్జాగా ఐదేళ్లలో 10లక్షల రూపాయలు వెనకేసుకుంటారా..? గోవా ప్రజలకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వేసిన సూటి ప్రశ్న ఇది. గోవాలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే గోవా ప్రజలకు పలు వరాలు ప్రకటించిన కేజ్రీవాల్.. ఢిల్లీ తరహా పాలన అందిస్తామంటూ హామీ ఇచ్చారు. ఇక మేనిఫెస్టో విడుదల సందర్భంగా గోవా ప్రజలకు ఎంత మేర […]

ఓటుకు నోటు అధికారికం.. ఆమ్ ఆద్మీ రేటు రూ.10లక్షలు..
X

ఇతర పార్టీల వద్ద ఓటుకి 2 వేల రూపాయలు తీసుకుంటారా? లేక ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపించి.. దర్జాగా ఐదేళ్లలో 10లక్షల రూపాయలు వెనకేసుకుంటారా..? గోవా ప్రజలకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వేసిన సూటి ప్రశ్న ఇది. గోవాలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే గోవా ప్రజలకు పలు వరాలు ప్రకటించిన కేజ్రీవాల్.. ఢిల్లీ తరహా పాలన అందిస్తామంటూ హామీ ఇచ్చారు. ఇక మేనిఫెస్టో విడుదల సందర్భంగా గోవా ప్రజలకు ఎంత మేర మేలు జరుగుతుందనేది వివరించారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తే మొత్తంగా ప్రతి కుటుంబానికి 10లక్షల రూపాయలు సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరుతుందని, అలాంటప్పుడు ఇతర పార్టీలకు చీప్ గా రూ.2వేలకు ఓటును అమ్ముకోవడం ఎందుకని ప్రశ్నించారాయన.

13 పాయింట్ల అజెండా..
గోవా ఎన్నికల సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలో ముఖ్యంగా 13 పాయింట్లు అందర్నీ ఆకర్షిస్తున్నాయి. గోవాలో తమ పార్టీ అధికారంలోకి వస్తే యువతకు పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశాలు కల్పిస్తామన్నారు కేజ్రీవాల్. ఉద్యోగం రానివారందరికీ నెలకు రూ.3వేల నిరుద్యోగ భృతి ఇస్తామంటున్నారు. గోవాలో 18ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు వెయ్యి రూపాయలు ఆర్థిక సాయం చేస్తామన్నారు. 24 గంటలు విద్యుత్, మంచి నీటి సరఫరా, ఉచిత విద్య సరేసరి. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో భూ సమస్యలకు పరిష్కారం, ప్రతి గ్రామంలో మొహల్లా క్లినిక్స్, రోడ్లకు మరమ్మతులు, పర్యాటక రంగ అభివృద్ధి ఇలా ఆయన విడుదల చేసిన మేనిఫెస్టో ఆకట్టుకునేలా ఉంది.

రేటు ఫిక్స్..
గోవా ఎన్నికల్లో అధికార బీజేపీకి గడ్డు కాలం ఎదురయ్యేలా ఉంది. అదే సమయంలో టీఎంసీ, ఆప్.. అక్కడ పాగా వేసేందుకు సిద్ధమయ్యాయి. అయితే కేజ్రీవాల్ ఓ అడుగు ముందుకేసి.. మేనిఫెస్టో ప్రకటనతో గోవాలో కలకలం రేపారు. 2వేలకు ఓటు అమ్మేసుకుంటారా… లేక 10లక్షల రూపాయలు అధికారికంగా తీసుకుంటారా అంటూ ఓటర్లను ప్రశ్నిస్తున్నారు. గోవాలో ఫిబ్రవరి 14న 40 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకేదశలో పోలింగ్‌ జరుగుతుంది. మార్చి 10న మిగతా 4 రాష్ట్రాలతో కలిపి ఫలితాలు విడుదల కావాల్సి ఉంది.

First Published:  16 Jan 2022 9:26 PM GMT
Next Story