హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ కాంబోలో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమా కెరీర్ లో విజయ్ దేవరకొండకు 14వ ప్రాజెక్టు.
పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుంది. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఈ రోజు కాస్టింగ్ కాల్ ప్రకటన చేశారు. ఔత్సాహిక నటీనటులను ఎంపిక చేసి సినిమాలో నటించే అవకాశం కల్పించనున్నారు.
తిరుపతి, అనంతపురం, కడప, కర్నూల్ లో జూలై 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆడిషన్స్ జరగనున్నాయి. ఈ సినిమా షూటింగ్ మొత్తం రాయలసీమలోనే జరగనుంది. నటనలో ప్రతిభ గల కొత్త టాలెంట్ కు ఇది గొప్ప అవకాశం.
ఒక వీరుడి పోరాటాన్ని చూపిస్తూ 19వ శతాబ్దం నేపథ్యంతో 1854 నుంచి 1978 మధ్య కాలంలో జరిగిన యదార్థ చారిత్రక ఘటనల ఆధారంగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నాడు దర్శకుడు రాహుల్ సంకృత్యన్.
‘డియర్ కామ్రేడ్’, ‘ఖుషి’ వంటి సక్సెస్ ఫుల్ సినిమాల తర్వాత మైత్రీ మూవీ మేకర్స్, విజయ్ కలిసి చేస్తున్న మూడో చిత్రమిది. ‘టాక్సీవాలా’ లాంటి సూపర్ హిట్ తర్వాత విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యన్ ఈ సినిమాతో మరోసారి కలిసి పనిచేస్తున్నారు. కాస్టింగ్ కాల్ పూర్తయిన తర్వాత టెక్నీషియన్స్, హీరోయిన్ వివరాల్ని వెల్లడిస్తారు.