తమిళనాడుకు అలాంటి పరిస్థితి రాకూడదనే ప్రతిఘటిస్తున్నాం
హిందీ కారణంగా 25 ఉత్తర భారతీయ భాషలు కనుమరుగైపోతున్నాయని తమిళనాడు సీఎం విమర్శ
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, తమిళనాడులోని అధికార డీఎంకే మధ్య హిందీ భాష విషయంలో మాటల యుద్ధం నడుస్తున్న విషయం విదితమే. ఈ క్రమంలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందీ కారణంగా 25 ఉత్తర భారతీయ భాషలు కనుమరుగైపోతున్నాయని విమర్శించారు. ఈ మేరకు గురువారం ఎక్స్ వేదికగా ఆయన పోస్టు పెట్టారు. 'ఇతర రాష్ట్రాల సోదర, సోదరీమణులారా.. హిందీ కారణంగా ఎన్ని భారతీయ భాషలు కనుమరుగయ్యాయో ఎప్పుడైనా ఆలోచించారా? 100 ఏళ్లలో ఉత్తర భారతంలో 25 భాషలు కనుమరుగయ్యాయి. భోజ్పురి, మైథిలి, బుందేలీ, గర్వాలీ, కుమావోని, మాగాహి, మార్వారీ, మాల్వీ, ఛత్తీస్గఢీ, సంథాలీ, అంజికా ఇలా అనేక భాషలు మనుగడ కోసం ఎదురుచూస్తున్నాయి. యూపీ, బీహాఆర్లు హిందీ రాష్ట్రాలు కావు. వాటి అసలు భాషలు గతంలో కలిసిపోయాయి. తమిళనాడుకు అలాంటి పరిస్థితి రాకూడదనే ప్రతిఘటిస్తున్నాం. జాతి, సంస్కృతిని నాశనం చేయడానికి భాషలపై దాడి చేస్తున్నారు' అని స్టాలిన్ రాసుకొచ్చారు.